Mission Bhagiratha | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కలుషిత నీటి ద్వారా వ్యాపించే అతిసార (డయేరియా) వంటి వ్యాధులకు మిషన్ భగీరథతో చెక్ పెట్టవచ్చని తెలంగాణ నిరూపించింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్వో) సైతం చెప్పింది. దేశంలో జల్జీవన్ మిషన్ను పూర్తిచేసి, ఇంటింటికీ శుభ్రమైన తాగునీటిని సరఫరా చేయగలిగితే డయేరియా కేసులను గణనీయంగా తగ్గించవచ్చని, 1.20 లక్షల మరణాలను నివారించవచ్చని తాజా నివేదికలో డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణలోపం, వ్యక్తిగత అపరిశుభ్రత వల్ల ప్రజలకు డయేరియా ముప్పు, కేసులు, మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. 135 దేశాలకుగానూ భారత ర్యాంకు మూడు అంశాల్లోనూ 50కిపైనే ఉన్నది. కలుషిత తాగునీటి వల్ల డయేరియా ముప్పు అధికంగా ఉన్న దేశాల్లో 55వ ర్యాంకు, పారిశుద్ధ్య నిర్వణలోపం వల్ల కలిగే ముప్పులో 54వ ర్యాంకు, వ్యక్తిగత అపరిశుభ్రత వల్ల ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో 56వ స్థానంలో నిలిచింది. దేశంలో ఏటా కలుషిత తాగునీటి వల్ల సుమారు 1.20 లక్షల మంది మరణిస్తున్నారని, వ్యాధి వల్ల అంతకు రెండుమూడు రెట్ల సంఖ్యలో తమ జీవిత కాలాన్ని కోల్పోతున్నారని వెల్లడించింది. భారత్లో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్జీవన్ మిషన్ను 2024నాటికి పూర్తి చేస్తామని కేంద్రం చెప్తున్నదని పేర్కొన్నది. ఇది పూర్తయితే ఏటా కలుషిత తాగునీటి వల్ల కలిగే సుమారు 1.20 లక్షల మరణాలను తగ్గించవచ్చని తెలిపింది.
రెండేండ్లలోనే 87 శాతం తగ్గిన కేసులు
రాష్ట్ర ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టి దాదాపు రూ.40వేల కోట్లతో రికార్డు సమయంలో పూర్తి చేసి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందస్తున్నారు. ఈ పథకం వల్ల కలుషిత నీటి ద్వారా కలిగే వ్యాధులు కనుమరుగు కావడంతోపాటు రాష్ట్రం ఫ్లోరైడ్ నుంచి విముక్తి పొందింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2021 నుంచి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఆ ఏడాది డయేరియా కేసులు గణనీయంగా తగ్గాయి. 2020లో జిల్లాలో 7,931 కేసులు నమోదుకాగా, మిషన్ భగీరథ అమలైన సంవత్సరంలో ఆ సంఖ్య 4,116కు తగ్గింది. 2022లో ఈ సంఖ్య మరింత తగ్గి 1127 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మిషన్ భగీరథ అమలుకు ముందు సంవత్సరంతో పోల్చితే 2022 నాటికి 86 శాతం కేసులు తగ్గాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పేర్కొన్నది. స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తే కేసులను, మరణాలను తగ్గించవచ్చని చెప్పింది.