అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో మీరు సిద్ధహస్తులు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టండి. వాటర్మ్యాన్ రాజేంద్రసింగ్ గారు డిమాండ్ చేసినట్టు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే. లేదంటే ఈ బాంబుల సెగ మీ కుర్చీ దాకా రావడం ఖాయం.
భూగర్భ జలాలు పెరుగాలని మేము చెక్డ్యామ్లు కడితే.. వాటిని కొందరు కూల్చేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారు. మీ ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా?. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్రసింగ్ రిపోర్ట్ చెంపపెట్టు. ఇప్పుడు మీ సమాధానం ఏమిటి రేవంత్రెడ్డి?’
హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేసిన దుండగులు.. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్డ్యామ్లనే జిలెటిన్ స్టిక్స్తో పేల్చివేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్మ్యాన్ రా జేంద్రసింగ్ ‘ఇది మాన వ ప్రేరేపిత విధ్వంసం’ అని మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఎద్దేవా చేశారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్చేసి, జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలు సహా నిరూపించారని పేర్కొన్నారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన చెక్డ్యామ్లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా? ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్స్టర్ల అడ్డానా? అంటూ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.