TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 36 మంది నిందితులపై సిట్ శుక్రవారం కోర్టులో ప్రాథమిక చార్జ్షీట్ను దాఖలు చేసింది. 98 పేజీల చార్జ్షీట్లో 49 మంది నిందితులను అరెస్ట్ చేశామని, ప్రశ్నపత్రాల క్రయవిక్రయాలలో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టు సిట్ పేర్కొన్నది. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు న్యూజిలాండ్లో ఉన్న ఒక నిందితుడు మినహా 49 మందిని సిట్ అరెస్ట్ చేసింది. అరెస్టు అయిన వారిలో 16 మంది దళారులు కాగా మిగతా వాళ్లు వివిధ పరీక్షలు రాసిన వారిగా సిట్ పేర్కొన్నది. 90 రోజులు పూర్తికాకముందే సిట్ అధికారులు కోర్టుకు చార్జ్షీట్ దాఖలు చేయటంతో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిల బెయిల్ మంజూరుసై సందిగ్ధత నెలకొన్నది. రూ.1.63 కోట్ల లావాదేవీలు: ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన మధ్యవర్తులు, నేరుగా ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారు. పేపర్ కొనుగోలు, అమ్మకాల ద్వారా ఈ వ్యవహారంలో రూ.1.63 కోట్ల ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు సిట్ వెల్లడించింది. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీజ్ చేసి రామంతాపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపింనట్టు సిట్ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం న్యాయస్థానంలో ప్రాథమిక చార్జ్షీట్ను దాఖలు చేసినట్టు సిట్ వివరించింది.
వరంగల్ విద్యుత్తుశాఖ అసిస్టెంట్ ఇంజినీర్ పూల రమేశ్కుమార్తో సహా పరీక్షా కేంద్రంలోకి చాట్జీపీటీ సహకారంతో సమాధానాలు గుర్తించిన ఎమ్ ప్రశాంత్ అలియాస్ చంటీ, బీ మహేశ్, వీ నరేశ్లతోపాటు ఏఈ పేపర్ కొనుగోలు చేసిన జీ శ్రీనివాస్నాయక్ విధించిన ఆరు రోజుల కస్టడీ శుక్రవారంతో పూర్తికావటంతో 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. ఐదుగురిని మళ్లీ జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
పేపర్ లీకేజీ కేసులో సిట్ మహ్మద్ ఖాలీద్ అనే నిందితుడిని అరెస్టు చేసింది. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపర్చగా..14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితుడు ఏఈ పూల రమేష్ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఆయనకు సహరించినట్టు సిట్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
మూడు వారాల్లోగా సిట్ దర్యాప్తు నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సింగిల్ జడ్జి శుక్రవారం విచారించారు. నిందితులపై చార్జ్షీట్ దాఖలైందని టీఎస్పీఎస్సీ తరఫు అడ్వొకేట్ కోర్టుకు విన్నవించారు. సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్నదని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదించారు. సీబీఐకి బదిలీ ఎందుకని పిటిషనర్ను కోర్టు ప్రశ్నిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.