హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో ఎన్డీయేలో భాగస్వామి అయినా, తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి గురువారం వెల్లడించారు.
తెలంగాణలో టీడీపీ రాజకీయ ప్రయాణం గత కొన్నేండ్లుగా క్లిష్ట వాతావరణంలో కొనసాగుతున్నదని, తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. మహానాడులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంటామని, జూన్ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తామని ఆమె తేల్చి చెప్పారు.