హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సోమవారం ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నెల రోజులుగా జైలులోనే ఉన్న ఆయన బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక సుప్రీంకోర్టుపైనే ఆశలు మిగిలాయి. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ఇరుపక్షాల న్యాయవాదులు సోమవారం సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు.
తమకు మరోసారి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో ధర్మాసనం కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అంతకుముందు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వటం కుదరదని స్పష్టంచేశారు. బాబును సీఐడీకి ఇదివరకే రెండు రోజుల కస్టడీకి ఇచ్చామని, ఇక ఇవ్వడం కుదరదని కూడా తేల్చి చెప్పారు. సీఐడీ నమోదు చేసిన ఇతర కేసుల్లో అరెస్టు కాకుండా చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.