‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు కొనేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు, వందెకరాలు కొనే పరిస్థితి వచ్చింది’
– సోమవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నిర్మాణానికి తానే ముగ్గుపోసానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. పదే పదే తనను తాను ప్రపంచ నిర్మాతగా ప్రకటించుకునే చంద్రబాబునాయుడు.. అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు.. రాష్ట్రపతి, ప్రధానులను తానే నియమించానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఇన్నాళ్లకు ఆయన నోటివెంట ఒక నిక్కమైన, నిజమైన మాటొకటి వచ్చింది. ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు కొనేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు, వందెకరాలు కొనే పరిస్థితి వచ్చింది’ అని బాబు వ్యాఖ్యానించారు. సోమవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత రెండు రాష్ర్టాల్లో భూముల విలువను పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పైకి చూస్తే చంద్రబాబు వ్యాఖ్య ప్రశంసలా కనిపిస్తుంది కానీ, కాదు. తెలంగాణవాళ్లకు బతకడం, బట్టకట్టడం, వరి అన్నం తినడం నేర్పామంటూ పలు సందర్భాల్లో అహంకారం చూపిన నోరు కదా అది.
ఆధిపత్య అహంకారాన్ని అణువణువునా నింపుకొన్న బాబు తన స్వభావానికి భిన్నంగా ఎక్కడైనా, ఎప్పుడైనా తెలంగాణను ప్రశంసిస్తడా? ఆయన జీవితకాలంలో ఆ పనిచేస్తడా? అందునా కేసీఆర్ను పొరపాటునైనా బాబు ప్రశంసిస్తడా? అదే ఆలోచించాల్సిన విషయం. అర్థం, అవగతం చేసుకోవాల్సిన విషయం. మరి చంద్రబాబు ఈ మాటలు ఎందుకు అన్నారు? వీటి లోతేమిటి? లోగుట్టేమిటి? అంతరార్థమేమిటి? అసలు సంగతేమిటి? తెలంగాణ అంటే బాబుకు మొదటినుంచీ అవమానం. బాబు అంటేనే తెలంగాణకు మొదటినుంచీ అనుమానం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నలిగిన తెలంగాణకు సమైక్యపాలకుల నల్లికుట్ల వ్యవహారాలు, నక్కజిత్తుల పన్నాగాలు, నంగి మాటలు బాగా ఎరుక. రాష్ట్ర ఏర్పాటును బలంగా వ్యతిరేకించిన చంద్రబాబు..
ప్రపంచంలోనే ఎక్కడాలేని ‘రెండుకండ్ల సిద్ధాంతం’ చివరిదాక వల్లెవేసిన ఉదంతాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోలేదు. తెలంగాణ ఏర్పాటును చివరి నిమిషం దాకా అడ్డుకున్న చంద్రబాబు స్వరం అనూహ్యంగా ఎందుకు మారింది? అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మే చంద్రబాబు ఇప్పుడు అనివార్యంగా ఇక్కడి అభివృద్ధిని ఎందుకు కొనియాడుతున్నారు? బాబు మాటల్లోని మర్మమేమిటి? తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో యాభై, వందెకరాలు కొనుక్కోవచ్చునంటూ టీడీపీ అధినేత చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. అయితే ఆయన తెలంగాణను మనస్ఫూర్తిగా పొగుడుతున్నడా? లేక తెలంగాణ అభివృద్ధి మీదికి ఇతరులను రెచ్చగొడుతున్నడా? ఒకవేళ రెచ్చగొట్టడమే అయితే.. ఎవరిని ఎవరి మీదికి ప్రయోగించాలని చంద్రబాబు చూస్తున్నారు?
రెచ్చగొట్టడమే అంతరార్థమా?
ప్రాథమికంగా బాబు వ్యాఖ్యలోనే ఒక ఆధిపత్య అభిజాత్యం లీలగా కనిపిస్తున్నది. ‘ఒకప్పుడు మనం కొనేవాళ్లం.. ఇప్పుడు కొనలేకపోతున్నాం’ అన్న అర్థంతోపాటు ఆయన పాలన సాగించిన సమయంలోనూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లో చంద్రబాబు ఏపీ వైపే నిలబడి మాట్లాడుతున్నట్టు అర్థమవుతున్నది. ‘వేరే ప్రాంతాలవాళ్లు తెలంగాణకు వచ్చి భూములు కొనొచ్చు. తెలంగాణ వాళ్లు ఇతర ప్రాంతాలకు పోయి భూములు కొనడమేమిటి?’ అన్న చిన్నచూపే ఆయన వ్యాఖ్యల్లో ద్యోతకమవుతున్నది. తెలంగాణ వాళ్లు ఏపీలోనో, ఇతర రాష్ర్టాల్లోనో భూములు కొనుక్కోవద్దా? తెలంగాణ రైతు సంపన్నుడు కావొద్దా?
రెచ్చగొట్టేందుకే బాబు పాచిక
తన వ్యాఖ్యల ద్వారా మానిన గాయాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తద్వారా తన కుట్రపూరిత స్వభావాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. సహోదరుల్లా బతుకుతున్న వాళ్ల మధ్య, ఇరు రాష్ర్టాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాడానికి తొలి పాచిక విసిరిండు. తంపులు పెట్టి.. మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సందుదొరికితే దూరిపోవాలని చూస్తున్నారు. ఆ దిశగానే భూముల విలువపై బాబు ఒక విషపు పాచిక విసిరారు. ఆయన పాచికలు ఇక పారవన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి 2020 విజన్ కలిగిన, ప్రపంచంలోనే సాటిలేని పరిపాలకుడైన చంద్రబాబు నాయుడు, తాను సుదీర్ఘకాలం సమైక్య రాష్ర్టాన్ని పరిపాలించానని చెప్పుకునే చంద్రబాబు మరి తన పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఈ తరహాలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? తన ఏలుబడిలో తెలంగాణ పతారను పెంచి, ఇక్కడి భూమి విలువను ఎందుకు పెంచలేకపోయారు? ఈ గడ్డను మట్టిగడ్డగానే ఎందుకు ఉంచారు? బంగారు తునకగా మార్చే పని మనస్ఫూర్తిగా తన ఏలుబడిలో ఏనాడూ ఎందుకు చేయలేదు? ఇప్పుడు మరో ముసుగులో ఆయన తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తున్నడు. ఆయనను రానిచ్చామా.. అంతే సంగతి! తెలంగాణ మళ్లీ వెనక్కి నడిచి చంద్రబాబు కాలానికి వెళ్తుంది. బాబుకాలం కానికాలం. కష్టకాలం. కరువుకాటకం. చంద్రబాబు చెప్పినట్టుగానే.. ‘ఎకరం భూమి పొరుగు రాష్ర్టాల్లో 50వ వంతు ధరకూడా పలుకని’.. దుర్భిక్షపు, దౌర్భాగ్యపు కాలం! దశాబ్ది సంబురాల తెలంగాణకు అవసరమా ఆ దరిద్రం?
చంద్రబాబు తాజా వ్యాఖ్యల వెనుక నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ‘ఇటీవలికాలంలో ఆయన బీజేపీతో అంటకాగుతుండటం చూస్తున్నాం. ప్రధాని మోదీని కలవడానికి చంద్రబాబు వెంపర్లాడటం, బీజేపీతో చేతులు కలపడానికి తహతహలాడటం ఇటీవలి పలు సందర్భాల్లో గమనిస్తున్నాం. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు తన తాబేదార్లను వేరే పార్టీల్లోకి పంపి పరోక్షంగా చక్రం తిప్పాలని కొన్నేండ్లుగా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు వ్యాఖ్యలు పైకి చూస్తే ప్రత్యర్థిని మెచ్చుకున్నట్టు కనపడుతుంది. కానీ దాని వెనుక లోతైన అర్థాలున్నాయి’ అని విశ్లేషకుడు ఒకరు చెప్పారు. మరోవైపు కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి ఇటీవల ఏపీలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నది. అక్కడ కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. బీఆర్ఎస్ తమ ప్రాంతానికి రావాలని ఏపీ ప్రజలనుంచి వినతులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. తెలంగాణలాగే ఏపీనీ అభివృద్ధి చేయాలని అక్కడి మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులతో పార్టీని నడపడమే తప్ప.. ఏనాడూ ముఖాముఖి తలపడటం తెలియని చంద్రబాబు.. ఏపీలో రోజురోజుకూ బలపడుతున్న బీఆర్ఎస్పై తన అక్కసును వెల్లగక్కుతున్నట్టుగా అర్థమవుతున్నది. బీఆర్ఎస్కు అడ్డంకులు కల్పించేందుకు, ప్రజల్లో బీఆర్ఎస్పై ఒక వ్యతిరేకతను సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.