బాన్సువాడ, జూలై 14: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏపీకి చెందిన చంద్రబాబు ఏజెంట్ అని, బాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్కు పీసీసీ పదవి ఇప్పించిందే చంద్రబాబు చెప్పారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోచారం మీడిమాతో మాట్లాడారు. సాగుకు విద్యుత్తు సరఫరాపై రేవంత్ వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నాయని, కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టుపక్కల రైతులను భయపెట్టి భూ కబ్జాలు చేసే వ్యక్తి, దళారుల వ్యవస్థను ప్రోత్సహించి, పైసలు ఇయ్యని వారిపై దాడులు చేయించే వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు. రేవంత్ ఏ పార్టీలో ఉన్నా దానిని బొంద పెడతారని ఎద్దేవాచేశారు. తప్పుడు కూతలు కూసి రైతాంగాన్ని అవమానించడమే కాకుండా, సిగ్గులేకుండా రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గాంధీభవన్లో ధర్నాలు చేస్తున్నారని, 3 గంటలు విద్యుత్తు ఇస్తామని చెప్పినందుకు ధర్నాలా? కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నదని ధర్నాలా? రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బషీర్బాగ్లో రైతులపై కాల్పులకు ఆజ్యం పోసింది చంద్రబాబేనని పోచారం చెప్పారు. ఆ రోజున తామంతా అసెంబ్లీలో ఉన్నామని, ఆ రోజు కేసీఆర్ మైకు పట్టుకొని చంద్రబాబును ఉతికి పారేశారని, అందుకు తానే సాక్ష్యమని పేర్కొన్నారు. విద్యుత్తు చార్జీలు పెంచాలని తీసుకుంటున్న నిర్ణయం తప్పు అని చంద్రబాబును ఎదురించింది కేసీఆరేనని గుర్తుచేశారు. టీడీపీలో ఉండి, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉత్తరం రాసి చంద్రబాబును వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్ అని, విద్యుత్తు చార్జీలను పెంచవద్దని నిండు సభలో కేసీఆర్ చెప్పారని, అలాంటి కేసీఆరే ఫైరింగ్కు కారణమని మాట్లాడిన రేవంత్కు మతిపోయిందా? అని మండిపడ్డారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు చెప్పడంతో జీర్ణించుకోలేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్కు పోయినసారి వచ్చిన సీట్లు కూడా ఈసారి రావని చెప్పారు. కర్ణాటకలో బీజేపీపై వ్యతిరేకత వల్లే సరైన ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ గెలిచిందని, అది నేతల గొప్ప కాదని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేస్తున్న పనులు అర్థం పర్థం లేనివని, ఏదో ఒక సబ్స్టేషన్కు వెళ్లి అక్కడ లాగ్బుక్కులో 24 గంటల కరెంటు లేదని మాట్లాడారని, రాష్ట్రంలో ఒక్కటే సబ్స్టేషన్ లేదని, మూడు వేలు ఉన్నాయని పోచారం గుర్తుచేశారు. స్థానికంగా ఉన్న సమస్యల కారణంగా ఎక్కడన్న ఆరగంట, గంట కరెంటు పోతే పోతుండవచ్చని చెప్పారు. ఎక్కడైతే సమస్య వచ్చిందో ఆ సబ్స్టేషన్కు వెళ్లి చూసుడు కాదని, రాష్ట్రమంతా తిరిగి చూడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ పిచ్చోడని, అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని పోచారం దుయ్యబట్టారు. తెలంగాణ విద్యార్థులను అవమానించేలా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. వోక్స్వ్యాగన్ కుంభకోణం ఏమిటో.. బొత్స ఏందో ప్రజలందరికీ బాగా తెలుసని చురకలంటించారు. విద్యావ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా ఉన్నదని చెప్పారు.