నిజామాబాద్: బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారంటూ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) మండిపడ్డారు. తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతుల కంటే చంద్రబాబుపై ఎక్కువ ప్రేమ ఉందా అంటూ ధ్వజమెత్తారు. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలను ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని పసుపు మార్కెట్ యార్డును కవిత సందర్శించారు. పసుపు రైతుల సమస్యలు, పసుపు ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాభవన్లో ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన ప్రకటన చేశారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను తరలించడానికి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారు. బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది. అందుకే చంద్రబాబు ఎలా చెబితే సీఎం రేవంత్ రెడ్డి అలా నడుచుకుంటున్నారు.
నిజంగా తెలంగాణహితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు. ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదు. గతంలో ఏపీ ప్రాజెక్టులు చేపడితే, కాలువలు విస్తరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. తెలంగాణ రైతుల కంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ చంద్రబాబుపై ఉందా. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలి. నోరుందికదా అని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ఒర్రుతున్నారు.
కేంద్రం పేరుకే గెజిట్ జారీ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు. దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయి. దానివల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుంది. వ్యాపారులంతా సిండికేట్గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారు. నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదు. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎంత మంచి నాణ్యతగల పసుపుకు అయినా మంచి ధర ఇవ్వడం లేదు. పసుపునకు రూ.12 వేల కనీస ధర కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తక్షణమే పసుపుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. పసుపు బోర్డుకు చట్టబద్ధత, కనీస మద్ధతు ధర కోసం కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దీన స్థితిలో ఉన్న పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మార్చి 1లోపు బోనస్ ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ను దిగ్భందిస్తాం’ అని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని విమర్శించారు. తనపై మాట్లాడవద్దని చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ఖర్మ అన్నారు. అయినా విజ్ఞత లేకుండా ఆయన మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ చూస్తున్నారని వెల్లడించారు. ఆయనలా మాట్లాడి తన స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదన్నారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశారు.