సిద్దిపేట : మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక చాకలి ఐలమ్మ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణం అన్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాం. ఆమె పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో ఆధునాతన ధోబి ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించాం. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.