హైదరాబాద్, మార్చి 28 (నమస్తేతెలంగాణ): బీజేపీ ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలని, కళారూపాలతో ప్రజలను చైతన్యపర్చాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ మఖ్ధూంభవన్లో అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ ప్రజానాట్య మండలి సంయు క్త రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా చాడ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ఆర్థిక నేరాలు, మతోన్మాదాన్ని పెంచుతున్నదని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, మోదీని ఎకుపెడుతూనే, స్థానిక సమస్యలను జోడిస్తూ కొత్త రకమైన పాటలతో ముందుకు సాగాలని కవులు, కళాకారులకు సూచించారు. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘పల్లెపల్లెకు సీపీఐ’, ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా జానపద గేయాలు, ఒగ్గు కథలు, వీధినాటకాలను రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్, ప్రజా నాట్యమండలి పల్లె నర్సింహ, కే శ్రీనివాస్, అరసం కార్యదర్శులు రాపోలు సుదర్శన్, కేవీఎల్, కవులు, కళాకారులు పాల్గొన్నారు.