కేసీఆర్ పథకాలతో రాష్ట్రంలో ఎవుసం పండుగ
మోదీ విధానాలతో సంక్షోభం వైపు పయనం
ఎనిమిదేండ్లలో మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి
పెరిగిన డీజిల్, ఎరువుల ధరలు, కూలీ రేట్లు
రైతుల పెట్టుబడికి దక్కని గిట్టుబాటు ధర
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి.. తెలంగాణకు ప్రధాన ఆదెరువు అయిన వ్యవసాయాన్ని పరిపుష్టం చేయడానికి కంకణం కట్టుకొన్నారు. రైతుబంధు రూపంలో పెట్టుబడి ఇచ్చారు. రైతుబీమాతో భరోసా ఇచ్చారు. కాళేశ్వరం.. మిషన్ కాకతీయతో పుష్కలంగా.. సాగునీటిని అందించగా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణమైంది. అభివృద్ధికి కేరాఫ్గా చెప్పుకొన్న మోదీ.. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ.. రైతులపై కక్ష కట్టినట్టే వ్యవహరిస్తున్నారు. దేశానికి ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయాన్ని అన్ని విధాలుగా సంక్షుభితంగా మార్చారు. కేంద్రం నిర్వాకంతో తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అంతా నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొన్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అసంబద్ధ, అనాలోచిత విధానాలతో మోదీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని రైతులోకం ఆక్రోశం వ్యక్తంచేస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం వ్యవసాయంపై ప్రత్యక్షంగానే పెనుభారాన్ని మోపింది. దుక్కి దున్నే దగ్గరి నుంచి కోతలు పూర్తయ్యి, పంటను మార్కెట్ తరలించే వరకు ప్రతి చోట రెట్టింపు భారం పడింది. పేరుకు రైతు కుటుంబానికి ఐదు ఎకరాలకు కలిపి ఏటా రూ.6 వేలు మాత్రం ఇస్తున్నారు. ఎప్పుడో ఒకసారి 2వేలు ఇవ్వడం వల్ల దాని ఉపయోగం కూడా లేకుండా పోయింది.
వరి సాగుకు ఎకరానికి సాధారణంగా రూ.35 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు అవుతున్నది. నారు పోయడం, నాట్లు వేయడం, కలుపుతీయడం వరకు రూ.6 వేలు ఖర్చు కాగా, విత్తనాలకు రూ.1100, కోతకు రూ.3000, ఎరువులకు రూ.4 వేలు, పురుగు మందులకు రూ.5 వేలు, కలుపు కూలీలు రూ.1500, పురుగుమందుల కూలీలు రూ.1500 ఖర్చవుతున్నాయి. విత్తనాలు, ఎరువులపై ఉన్న సబ్సిడీ ఎత్తేయడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. కూలీల ఖర్చులు భారంగా మారాయి. విత్త నం నాటే దగ్గర నుంచి నూర్పిడి వరకు పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయి. గతంలో దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ.4,600 ఖర్చు అవుతుండగా, పెరిగిన డీజిల్ ధరల వల్ల ప్రస్తుతం ఏకంగా రూ.7 వేలు వసూలు చేస్తున్నారు. నాట్లు వేసే కూలీలకు ఎకరానికి రూ.600 పెరిగింది. కూలీల రేట్లు రూ.300 పెరిగాయి. హార్వెస్టర్ల అద్దెలు రూ.800కు పెరిగాయి. రోజురోజుకు పెరుగుతున్న పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా కేంద్రం ధాన్యం కొనుగోలు ధరలు నిర్ణయించకపోవడంతో రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుంది.
కనీస మద్దతు ధరలేవి?
కనీస మద్దతు ధరలు నిర్ణయించడంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతూ వస్తున్నది. అందుకే మద్దతు ధరల నిర్ణయాన్ని తమకు అప్పగించాలని రాష్ర్టాలు కోరుతున్నాయి. 2014-15లో క్వింటాలు వరి ధాన్యం ఉత్పత్తికి రూ.1,549 ఖర్చయితే.. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,540 గా నిర్ణయించింది. తర్వాత 8 సంవత్సరాల కాలంలో క్వింటాలు వరి ధాన్యం ఉత్పత్తికి 2020-21లో ఉత్పత్తి ఖర్చు రూ.2,387 అయితే, కేంద్రం మాత్రం రూ.1,960 ప్రకటించి చేతులు దులుపుకొన్నది. అంటే రైతు నికరంగా క్వింటాల్కి రూ.427 నష్టపోతున్నాడు. తెలంగాణ వంటి రాష్ర్టాల్లో మాత్రమే రైతులు పూర్తిస్థాయిలో పెట్టుబడి మద్దతు, బీమా, కొనుగోలు మద్దతు ఉండటంతో సాగులో కొనసాగుతున్నారు.
వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయ్..
విత్తనాలు, ఎరువులు, కూలీలు, ట్రాక్టర్, పంట కోసే హర్వెస్టర్ రేట్లు ఏటా రూ.200 వరకు పెంచుతున్నారు. డీజిల్ రేట్లు పెరగడంతో దుక్కిదున్నే ఖర్చు ఎకరానికి రూ.1,600 పెరిగింది. కోత కోసే హర్వెస్టర్కు రూ.600 పెరిగింది. నాట్లు వేసేందుకు రూ.500 పెరిగింది. కూలీల రేట్లు రూ.300 వరకు పెరిగాయి. ధాన్యం రేటు మాత్రం పెరగలేదు. కోత దశలో వరి పైరుకు తెగుళ్లు సోకి రసాయన మందుల కొట్టేందుకు ఖర్చులు భారీగా పెరిగి.. పెట్టుబడులు కూడా ఎల్లే పరిస్థితి లేదు.
– అనుముల శ్యాంసుందర్రెడ్డి (రైతు..నల్లగొండ జిల్లా)
కష్ట పడితే ఆదాయమేది?
కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక.. రైతుబంధు, మద్దతు ధర ఇవ్వడం కొంత సాయంగా ఉంది. కానీ కేంద్రం ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ తీసేసి, రేట్లు పెంచడం భారమైంది. డీజిల్ రేట్లు పెంచడంతో వ్యవసాయంపై మూడు రెట్ల ఖర్చులు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయానికి , కేంద్రం తోడుగా ఉంటే.. రైతుకు లాభం. పండించిన పంటకు కేంద్రం మద్దతు ధరలను భారీగా పెంచాల్సిన అవసరముంది.
– పిడిగెం నాగయ్య (రైతు – నల్లగొండ)