ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు వల్ల గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్,ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ఏర్పాటుచేసిన దర్బార్ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు గడిచిన ఎనిమిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలు, ఆదివాసి గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చిందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం విడుదల చేసే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రావడంతో పల్లెలు అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్నాయని అన్నారు.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడంతో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రూ. 340 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.