హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు. పెండింగ్లో ఉన్న విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని కోరినట్టు తెలిసింది.
వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతిని అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలను గత సమావేశం ఎజెండాలో చేర్చారు. సెప్టెంబర్ 27 జరిగిన సమావేశంలో 7 ఉమ్మడి అంశాలతోపాటు ఏపీకి సంబంధించిన 7 అంశాలపై చర్చించారు. ఏపీ లేవనెత్తిన అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ సమావేశం ఎలాంటి నిర్ణయాలు లేకుండా అసంపూర్తిగా ముగిసింది. విభజన చట్టంలో పేరొన్న అన్ని అంశాలను పదేండ్లలో పరిష్కరించుకోవాలని నిబంధనలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే సమావేశానికి వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు.