రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలి
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
రుద్రూర్(కోటగిరి), ఏప్రిల్ 16: రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఆహార ధాన్యాలను రైతుల నుంచి సేకరించి ఎఫ్సీఐ ద్వారా ప్రజలకు సరఫరా చేయడం కేంద్రం బాధ్యత అని గుర్తుచేశారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకొన్నదన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా యాసంగిలో పండించిన వరి ధాన్యం మిల్లింగ్లో నూక శాతం అధికంగా వస్తున్నదన్నారు. దీన్ని నివారించడానికి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరితే మొండి వైఖరి అవలంబించిందన్నారు. రైతు నష్టపోకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం రైతుకు మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. అనంతరం కోటగిరి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ముస్లిములు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.