మూడు నిబంధనలతో పేదల నోట్లో మట్టి
నిబంధన: కూలీలు ఉదయం 10 గంటల్లోపు సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఫొటోలు దిగి అప్లోడ్ చేయాలి.
హరీశ్ ఫైర్: ఎండాకాలంలో కూలీలు 8 గంటలపాటు పని చేయడం సాధ్యమేనా? ఇచ్చే గరిష్ఠ కూలి రూ.257 చెల్లించడానికి ఇంత కఠిన నిబంధనలా?
నిబంధన: ఉపాధి హామీలో ఒకసారి 20 రకాల పనులు మాత్రమే చేపట్టాలి.
హరీశ్ ఫైర్: ఈ పథకం ద్వారా తెలంగాణ అనేక పనులు చేపట్టడంతో రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజా సర్క్యులర్తో కూలీలకు పనులను ఎంపిక చేసుకొనే అవకాశాలు తగ్గి పనికి దూరమవుతారు. పేదలు, చిన్న సన్నకారు రైతులు ఆర్థికంగా దెబ్బతింటారు.
నిబంధన: స్థానిక సంస్థల్లో ఓడిన అభ్యర్థులకు పర్యవేక్షణలో భాగస్వామ్యం ఇవ్వాలి.
హరీశ్ ఫైర్: ఓడిన వారికి పర్యవేక్షణ అధికారాలు ఇవ్వ డమా? వాట్సాప్ గ్రూపులో చేర్చి కూలీల పని సమాచారాన్ని అధికారులకు చేరవేయాలని పేర్కొనడం దేనికి సంకేతం? ఇది కూలీలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. తెలంగాణలో ఓడిపోయిన బీజేపీ కార్యకర్తలకు అధికారం కట్టబెట్టడం కోసమే ఈ నిర్ణయమని స్పష్టమవుతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసి లక్షలమంది ఉపాధిని దెబ్బతీసిన కేంద్రం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పథకాన్ని నీరుగార్చే పనిలో పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన సర్క్యులర్పై మంత్రి హరీశ్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పేదల పనికి అడ్డగోలు నిబంధనలు విధిస్తూ, క్రమంగా పథకాన్ని ఎత్తివేసేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నాగం పన్నిందని చెప్పారు. కోట్ల మంది నోట్లో మట్టికొట్టేలా కొత్త నిబంధనలు ఉన్నాయని.. వీటిని వెంటనే ఉపసంహరించుకొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్చేస్తూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మంత్రి హరీశ్రావు మంగళవారం లేఖ రాశారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ పదే పదే విజ్ఞప్తిచేసినా.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా పట్టించుకొన్న పాపాన పోలేదని విమర్శించారు. కుక్కను చంపడానికి పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టు, పేదల పాలిట కల్పతరువైన ఉపాధి హామీ పథకంపై అవినీతి ముద్రవేసి రద్దుచేసే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
కూలీలను అవమానించడమే..
కూలీలు పని ప్రదేశంలోనే ఉండి రోజుకు రెండు సార్లు మస్టర్ రోల్ అటెండెన్స్, ఫొటోలు అప్లోడ్ చేయాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేయడం వారిని అవమానించడమేనని మంత్రి అన్నారు. ఉపాధి పనులు ఎక్కువగా ఎండాకాలంలో జరుగుతాయని, వారు రోజంతా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న బీజేపీ నాయకత్వం.. ఇప్పుడు దేశంలోని కూలీలతోపాటు, తెలంగాణలో 57.46 లక్షల జాబ్ కార్డులు కలిగిన 1.21 కోట్ల మంది ఉపాధి హామీ కూలీల హకులను కాలరాస్తున్నది. దేశంలోని నిరుపేదలకు ఆదాయం, ఆహార భద్రత కల్పిస్తున్న పథకం ఉపాధి హామీ. దాన్ని రద్దు చేసేలా కేంద్రం కుట్ర చేస్తున్నది. ఇంతకు ముందున్నడూ లేని రీతిలో తనిఖీలు ప్రారంభించింది’ అని పేర్కొన్నారు. ఎండాకాలం లేదా వానాకాలంలో పని చేసేటప్పుడు కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సదరు సర్యులర్లో పొందుపరచకపోవడం అమానవీయం కాదా? అని ప్రశ్నించారు. 17 ఏండ్లుగా సాఫీగా పథకం అమలవుతుంటే.. కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాలంటూ కూలీలను వేధిస్తూ, వేతనాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నుంచి కూలీలను క్రమంగా దూరంచేసి, తర్వాత ఈ పథకాన్ని రద్దు చేయాలన్న వ్యూహంతోనే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధులెందుకు తగ్గించారు?
ఉపాధి హామీకి సంబంధించి దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం స్వయంగా రాజ్యసభలో ఈ విషయాన్ని చెప్పిందని గుర్తుచేశారు. తెలంగాణకు సంబంధించి రూ.83 కోట్లు చెల్లించలేదని కేంద్రమే అంగీకరించిందన్నారు. ‘కూలీలు చేసిన పనికి వేతనం చెల్లించకపోవడం దేనికి సంకేతం?’ అని నిలదీశారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇందులో రూ.18,380 కోట్లు పెండింగ్ బకాయిల చెల్లింపునకే వెళ్తాయని, మిగిలిన నిధులు పథకం అమలుకు ఏ మూలకు సరిపోతాయని కిషన్ రెడ్డిని నిలదీశారు. ఎకనమిక్ సర్వే 2017-18లో కేంద్ర ప్రభుత్వం ‘యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్’ (యూబీఐ)ను ప్రతిపాదించిందని మంత్రి గుర్తుచేశారు. దేశంలో 30% కుటుంబాలకు సంవత్సరానికి కనీసం రూ.72 వేల ఆదాయం వచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని ఆ నివేదిక సూచించిందని తెలిపారు. అర్థం పర్థంలేని నిబంధనలతో, నిధుల్లో కోతపెట్టి పేదల హకుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం యూబీఐని ఎలా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు. కూలీలు తమ శ్రమ ద్వారా దేశ సంపదను పెంచే పనిలో భాగస్వాములు అవుతుంటే ఆ పథకాన్ని రద్దు చేసే కుట్రకు కేంద్రం ఎందుకు తెరలేపిందో సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. దేశ ప్రయోజనాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిసే నిర్ణయాలను తెలంగాణ బిడ్డగా ఎలా సమర్థిస్తున్నారంటూ కిషన్రెడ్డిని నిలదీశారు. కొత్త నిబంధనలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ విషయంలో తెలంగాణపై కేంద్రం తన వివక్షను కొనసాగిస్తూనే ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర రాష్ట్రాలకు అదనపు పనిదినాలు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పనిదినాన్ని కూడా కేటాయించలేదు. 2017-18 నుంచి 2021-22 వరకు అదనపు పనిదినాల కేటాయింపుల విషయాన్ని మంగళవారం కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పార్లమెంట్లోప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పలు రాష్ట్రాల్లో ఒక్కో కూలికి అదనంగా 50 రోజుల అదనపు పనిదినాలను కల్పించారు. తెలంగాణలో ఐదేండ్లలో ఏనాడు కూడా ఒక్క అదనపు పనిదినాన్ని కేటాయించలేదు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు జరగనట్టుగా కేంద్రం వ్యవహరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్తోపాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు అదనపు పనిదినాలను ఇచ్చినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో 2020, 2021లో భారీ వరదలు వచ్చాయి. 2019లో అధిక ఎండలతో ఉపాధి హామీ పని సమయాన్ని ఉదయం 7 నుంచి 11గంటల వరకు పనిచేయాలని సూచించారు. కానీ కేంద్రం వీటిని పరిగణనలోకి తీసుకోలేదు.