హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాగునీటి హకుల కోసం, వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడే అంశంలో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రగతి భవన్లో శుక్రవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు కేటాయించిన న్యాయమైన నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను కూడా లోతుగా పరిశీలించారు. గోదావరి కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకుండే నీటివాటాల గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరిగి ఇదే అంశం పై ఆదివారం చర్చను కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వకేట్ రవీందర్రావు, ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.