బాయికాడ మీటర్లు పెట్టలే..
షరతులకు లొంగిన రాష్ర్టాలకే వెసులుబాటు
ఏపీ సహా 10 రాష్ర్టాలకు 28 వేల కోట్లు అప్పు
5 వేల కోట్ల వరకు కోల్పోతున్న తెలంగాణ
రాష్ర్టానికి ఐదేండ్లలో 25 వేల కోట్లు నష్టం
నష్టపోయినా కేంద్రానికి తలొగ్గేది లేదు
రైతులకు అన్యాయం చేయబోమన్న కేసీఆర్
విద్యుత్తు సంస్కరణలు అమలు చేసిన రాష్ర్టాలకే జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణం తీసుకొనేందుకు అవకాశం కల్పిస్తాం. –పార్లమెంట్లో కేంద్రం ప్రకటన
నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనివ్వను. కేంద్రం చెప్పినట్టు చేస్తే రైతులు అవస్థలు పడుతరు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు, దళితులకు విద్యుత్తు రాయితీలు అందవు. ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో 25 వేల కోట్లు తెలంగాణ నష్టపోయే అవకాశం ఉన్నది. అయినా కేంద్రానికి తలొగ్గేది లేదు.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బాయికాడ మీటర్లు పెట్టిన ఏపీ సహా మొత్తం 10 రాష్ర్టాలకు ఇందులో అవకాశం కల్పించింది. వీటికి మొత్తంగా రూ.28 వేల కోట్ల రుణం అందనున్నది. కేంద్రంపై తిరగబడ్డ తెలంగాణ పేరును మాత్రం చేర్చలేదు. తద్వారా తెలంగాణ ఐదేండ్లకు సుమారు రూ.25 వేల కోట్లు రుణం తీసుకొనే అవకాశం కోల్పోయింది. రాష్ట్ర జీఎస్డీపీ సగటున రూ.10 లక్షల కోట్లు. ఇందులో 0.5 శాతం అంటే.. రూ.5 వేల కోట్లు. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఐదేండ్లపాటు అదనపు రుణం పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ లెక్కన కేంద్రం కక్షపూరిత విధానాలతో తెలంగాణ రూ.25 వేల కోట్లు నష్టపోయినట్టే.
అదనపు రుణం పొందేందుకు కేంద్రం అనుమతించిన రాష్ర్టాల్లో అత్యధిక శాతం బీజేపీ పాలిత, ఎన్డీయే అనుకూల రాష్ర్టాలే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, అస్సాం, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు కేంద్రం అదనపు రుణం పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీలో ఇప్పటికే బాయికాడ మీటర్లు పెట్టడం మొదలైపోయింది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించారు. బిల్లులు తీస్తున్నారు. ప్రస్తుతానికి ఆ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తున్నా.. రైతుల నుంచి కనీస చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ మీటర్లు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగతా రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా.. కేంద్రం 10 రాష్ర్టాల్లోని కోట్లాది మంది రైతుల ఉసురు తీస్తున్నది.
ఏపీకి రూ.3,716 కోట్లు
బాయికాడ మీటర్లు పెడుతున్న ఆంధ్రప్రదేశ్కు అదనంగా రూ.3,716 కోట్లు అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేసిన రాష్ర్టాలకే ఎఫ్ఆర్ఎండీ పరిమితి అరశాతం పెంచినట్టు వెల్లడించింది.