హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి సీఎం కేసీఆర్ను అవమానించింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను నామమాత్రంగా ఆహ్వానించారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ నెల 2వ తేదీన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. అందులో ఈ నెల 12వ తేదీన జరిగే కార్యక్రమంలో ‘పాల్గొనండి’ (పార్టిసిపేట్) అని మాత్రమే పేర్కొన్నారు. ఎక్కడా కనీస ప్రొటోకాల్ను పాటించలేదు. ప్రధాని మోదీ వస్తున్న రామగుండం ఫ్యాక్టరీ ఉన్నది తెలంగాణలో. ప్రధాని తర్వాత అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పేరు ఉండాలి. పైగా ఎరువుల కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక భాగస్వామి.
ప్రభుత్వానికి 11 శాతం వాటా ఉన్నది. ఫ్యాక్టరీకి కావాల్సిన నీటి అవసరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని కేటాయించింది. మౌలిక సదుపాయాల కోసం రూ.200 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఈ లెక్కన సీఎం కేసీఆర్ను ‘ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొనాలి. కానీ కేంద్రం ‘పాల్గొనండి’ అని మాత్రమే పేర్కొంటూ లేఖతో సరిపెట్టింది. కనీసం ఫోన్ చేసి ప్రధాని కార్యక్రమం ఉన్నదని, రావాలని కోరలేదు. కనీసం వస్తున్నారా? లేదా? అని అడగలేదు. తెలంగాణ ప్రజలంటే మోదీ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టే అర్థమవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రికి ఇచ్చే మర్యాద ఇదేనా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.