హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉచితాలు వద్దు అంటూ బీజేపీ చేస్తున్న కుట్రలో ప్రధానంగా దళితబంధు ఉన్నదని, దీనిని తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. దళితులపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దళితబంధు పథకాన్ని తమ రాష్ర్టాల్లో అమలుచేయాలని, మ్యానిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళితబంధు ద్వారా ఇప్పటికే తొలి విడతగా 32 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, రూ.3,249 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చుచేసిందని వివరించారు. త్వరలో నియోజకవర్గానికి 500 కుటుంబాల ఎంపిక చేపడతామని, ఈ సంవత్సరాంతానికి 1,500 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. త్వరలో దళితబంధుపై జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దళితజాతి సముద్ధరణకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో కనీసం పదోవంతు అయినా బీజేపీ రాష్ర్టాల్లో ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు.
వికాసం కోసం టీఆర్ఎస్.. విద్వేషం కోసం బీజేపీ
రాష్ట్ర వికాసమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకొన్నదని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం, విద్వేషాలు రెచ్చగొట్టేందుకే సెప్టెంబర్ 17ను తెరమీదికి తెచ్చిందని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా ఉత్సవాలను నిర్వహిస్తుందని చెప్పారు. రేషన్షాపుల్లో మోదీ ఫొటో పెట్టాలంటూ యాగీ చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన స్థాయిని దిగజార్చుకొన్నారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల్లో కేంద్రం వాటా ఎంత ఉన్నదో నిర్మల చెప్పగలరా? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.