కరెంటు కొనకుండా అదానీ గ్రూప్ అడ్డుపుల్ల
బకాయిల సాకుతో ఎన్ఎల్డీసీలో ఫిర్యాదు
డబ్బు చెల్లించినా ఆలస్యంగా ఫిర్యాదు వెనక్కి
విద్యుత్తు కోసం బిడ్ వేయలేకపోయిన ట్రాన్స్కో
నేడు రాష్ట్రంలో 60 మిలియన్ యూనిట్ల కొరత
గృహ, వ్యవసాయ విద్యుత్తుకు స్వల్ప ఆటంకం
కోతల ప్రభావం లేకుండా చూస్తాం: సీఎండీ
రాష్ట్రంలో సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగం ఉన్నది. అదానీ గ్రూప్ నిర్వాకం వల్ల ఆదివారం 60 మిలియన్ యూనిట్ల (25 శాతం) వరకు కొరత ఏర్పడనున్నది.
– ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఎండాకాలానికి తోడు వ్యవసాయ అవసరాలు పెరగటంతో దేశంలో విద్యుత్తు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అవసరాలకు, సరఫరాకు మధ్య అంతరాన్ని పూడ్చుకొనే నైపుణ్యం లేక చాలా రాష్ర్టాలు సతమతం అవుతున్నాయి. వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా కోతలు పెడుతున్నాయి. సాంకేతికంగా పటిష్ఠ ఏర్పాట్లు చేసుకొన్న తెలంగాణ మాత్రమే 24 గంటలు విద్యుత్తు అందిస్తున్నది. తెలంగాణ విద్యుత్తు విజయ గాథ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమకు కూడా తెలంగాణలోలాగా విద్యుత్తు అందించాలని అనేక రాష్ర్టాల్లో పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కుట్ర జరుగుతున్నది. డబ్బులు కట్టినా ఎక్సెంజ్ నుంచి విద్యుత్తు సరఫరా కాకుండా అడ్డుకొనే కుతంత్రం శనివారం వెలుగులోకి వచ్చింది.
రాష్ర్టాలు తమ సొంత ఉత్పత్తికంటే ఎక్కువ విద్యుత్తు డిమాండ్ ఏర్పడితే ఆ మేరకు విద్యుత్తును ఇండియన్ ఎనర్జీ ఎక్చ్సేంజ్లో కొనుగోలు చేస్తాయి. అందుకు ఒకరోజు ముందుగానే బిడ్ దాఖలు చేయాలి. రాష్ట్రంలో అదానీ గ్రూప్నకు ఉన్న మూడు సౌర విద్యుత్తు ప్లాంట్ల ద్వారా ప్రభుత్వానికి విద్యుత్తు అమ్ముతున్నది. ఈ విద్యుత్తుకు సంబంధించి ట్రాన్స్కో రూ.190.40 కోట్లు బకాయి ఉన్నది. దీనిపై ఆదానీ గ్రూప్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)లో ఫిర్యాదు చేసింది. నిబంధనల ప్రకారం ఇలా ఫిర్యాదు వస్తే, బకాయి ఉన్న సంస్థ విద్యుత్తు కోసం బిడ్ వేయకుండా నిరోధిస్తారు. ఫిర్యాదు వెనక్కు తీసుకొన్న తర్వాతే బిడ్ వేయటానికి అనుమతి ఇస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల వరకు బిడ్లు స్వీకరిస్తారు.
ఆదివారానికి విద్యుత్తు సరఫరా కోసం ట్రాన్స్కో శనివారం బిడ్ దాఖలుచేయటానికి ప్రయత్నించగా అదానీ గ్రూప్ ఫిర్యాదు విషయం తెలిసింది. దీంతో వెంటనే ఉదయం 11.30 గంటలకు ట్రాన్స్కో బకాయి మొత్తం చెల్లించి ఫిర్యాదును వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరింది. విద్యుత్తు అత్యవసరం దృష్ట్యా బిడ్ వేసేందుకు మార్గం సుగమం చేయాలని ట్రాన్స్కో అధికారులు కోరారు. కానీ ఆ సంస్థ వెంటనే స్పందించలేదు.
సీఎండీ ఫోన్ చేసినా..
బిడ్ దాఖలుకు సమయం తక్కువ ఉండటంతో ఎన్ఎల్డీసీలోని ఫిర్యాదును వెంటనే వెనక్కు తీసుకోవాలని అదానీ గ్రూప్నకు ట్రాన్స్ కో అధికారులు విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు స్వయంగా అదానీ గ్రూప్ సీఈవోకు ఫోన్చేసి కూడా చెప్పారు. అయినా ఆ సంస్థ వెంటనే స్పందించకుండా శనివారం మధ్యాహ్నం 1.30 సమయంలో తాపీగా ఫిర్యాదు ఉపసంహంచుకొన్నది. దీంతో ట్రాన్స్కో తనకు అవసరమైన 60 మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలుకు బిడ్ వేయలేకపోయింది. ఈ కారణంగా ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నదని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగం ఉన్నది. అదానీ గ్రూప్ నిర్వాకం వల్ల ఆదివారం 60 మిలియన్ యూనిట్ల (25 శాతం) వరకు కొరత ఏర్పడనున్నదని ప్రభాకర్రావు తెలిపారు. దీనిని అధిగమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలపై కొరత ప్రభావం ఎక్కువ ఉండకుండా చూస్తున్నామని వివరించారు.
రైతుల కష్టాలతో పండుగ
రాష్ట్రంలో వరి సహా అనేక పంటలు ఇప్పుడు కోతకు వచ్చాయి. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇప్పుడే పంటలకు నీళ్లు ఎక్కువ అవసరం. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి విద్యుత్తును అంతరాయాలు లేకుండా అందించాల్సి ఉంటుంది. ఇంతటి కీలక సమయంలో రైతులకు నష్టం కలుగుతుందని తెలిసి కూడా కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. విద్యుత్తు కొనడానికి సిద్ధంగా ఉన్నా, అమ్మకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాధారణంగా అయితే బకాయిలు చెల్లించిన వెంటనే అదానీ సంస్థ ఫిర్యాదును వెనక్కు తీసుకొని ఉండేదని, అలా జరగలేదంటే తెరవెనుక ఏదో మతలబు జరిగిందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయంపై రేపు నానా యాగీ చేసేవారే ఈ కుట్ర వెనుక ఉన్నారని భావించాల్సి ఉంటుందని అంటున్నారు.