రుణ సమీకరణకు అనుమతి ఇవ్వకుండా వేధింపులు
కార్పొరేషన్ల రుణాలు ఎఫ్ఆర్బీఎం ఖాతాలోనే
బడ్జెటేతర రుణాలు రాష్ర్టాల అప్పుల్లో చేరుస్తారట
తేల్చిచెప్పిన కేంద్రప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి
అకస్మాత్తుగా చెప్పటం అత్యంత కక్షపూరిత చర్య
15వ ఆర్థికసంఘం చెప్పకున్నా అమలు.. వివక్షే
గట్టిగా వాదనలు వినిపించిన రాష్ట్ర అధికారులు
దేశం లోపలా.. బయటా కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకోవచ్చు. రాష్ర్టాలు తీసుకొందామనుకొంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. సంస్కరణల పేరుతో, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తున్నది. విద్యుత్తు సంస్కరణలు అమలుచేస్తేనే ఎఫ్ఆర్బీఎం5 శాతం పెంచుకోవడానికి అనుమతిఇస్తామన్న ఒక్క కారణం చాలు కేంద్రం వైఖరి ఏమిటో చెప్పటానికి..
తెలంగాణ కొత్త రాష్ట్రం. కేంద్రం తనంత తానుగా రాష్ర్టానికి తోడ్పడకపోగా.. కనాకష్టంపడి రుణాలు సమీకరించుకొని ముందుకు అడుగులు వేద్దామంటే.. ఆంక్షల పేరుతో కాళ్లల్లో కట్టెలు పెడుతున్నది. ఆర్థిక క్రమశిక్షణ బాగున్నదని రిజర్వుబ్యాంకు సైతం ప్రశంసించిన తెలంగాణకు చేయూతనందించాల్సిన కేంద్ర ప్రభుత్వం బొండిగె పిసికే ప్రయత్నం చేస్తున్నది.
సహకరించటం పక్కన పెడితే.. కనీసం ఎదుగుదలకు అడ్డుపడకుండా ఉంటుందా అంటే.. కక్ష సాధించినట్టుగా వ్యవహరిస్తున్నది. కార్పొరేషన్ల తీసుకున్న నిధులను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తెచ్చి.. రుణ సమీకరణలో కోత విధిస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై ఇప్పటికే నెలరోజులు దాటిపోయింది. రుణ సమీకరణ కోసం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. ఇదే విషయమై సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో జరిగిన వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): అప్పులపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రుణ సమీకరణకు రాష్ర్టానికి అనుమతి ఇవ్వకపోవటంపై తీవ్ర నిరసన తెలిపారు. సోమవారం కేంద్ర మంత్రిత్వ శాఖ.. అన్ని రాష్ర్టాల ఆర్థిక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం, 2022-23లో రాష్ర్టాలు తీసుకొనే అప్పులపై మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్రాలు వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకొని, వాటిని రాష్ట్ర నిధుల నుంచి చెల్లిస్తున్నాయని చెప్పారు.
ఈ అప్పులను కూడా రాష్ర్టాల అప్పులుగానే భావించి ఎఫ్ఆర్బీఎం కింద లెక్కిస్తామని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘కేంద్రం.. మూలధన వ్యయం కోసం 2020-21లో రూ.12 వేల కోట్లు, 2021-22లో రూ.15 వేల కోట్లు, 2022-23లో రూ.లక్ష కోట్లను రుణం రూపంలో రాష్ర్టాలకు ఇచ్చింది. ఇది ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు పూచీకత్తుగా ఉండి ఇప్పించిన నిధులు మూలధన వ్యయానికి సంబంధించినవే. ఈ రుణాలు ప్రధానంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాట ర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెందినవి.
ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి, ఇవి పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు రుణాలు తిరిగి చెల్లించే స్థితికి వస్తాయి. వీటిని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తేవడం అన్యాయం’ అన్నారు మరోవైపు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు హడ్కో, ఎన్సీడీసీ ఇచ్చే అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నా వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని గుర్తుచేశారు. ఇలా కొన్ని అప్పులను ఎఫ్ఆర్బీఎం పరిధిలో చూపటం, మరికొన్నింటిని చూపకపోవటం వంటి వివక్ష చర్యలు సరికావన్నారు.
అత్యంత కక్షపూరిత చర్యలు
రాష్ట్రానికి 2022-23లో రుణ సమీకరణకు ఇప్పటిదాకా అనుమతి ఇవ్వకపోవటంపై రాష్ట్ర అధికారులు తీవ్ర నిరసన తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, వివిధ అభివృద్ధి పథకాల కోసం కార్పొరేషన్ల ద్వా రా నిధులు సమీకరించుకొని, అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మూలధన వ్యయంలో దేశంలోనే తె లంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేయకపోయినా కేంద్రం బడ్జెటేతర రుణాలను రాష్ర్టాల అప్పుల్లో చేరుస్తామని అకస్మాత్తుగా చెప్పటం అత్యంత కక్షపూరిత చర్య అని అన్నారు.
కొత్త నిబంధనలను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని, అలా కాకుండా 2020-21 నుంచి అమలు చేయటం ఏమిటని నిలదీశారు. కరోనా నుంచి కోలుకొని గాడిలో పడుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని, రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సం ఘం చెప్పకపోయినా, ఆ పేరుతో అమలు చేయటమంటే రాష్ట్రంపై చూపే కక్షసాధింపు చర్యగా భావిస్తామని పేర్కొన్నారు. రుణాల విషయంలో కేంద్రం నిబంధనలనే తెలంగాణ కూడా పాటిస్తున్నదని, అయినా వివక్ష సరికాదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అప్పు తీసుకోవటానికి ఇవ్వాల్సిన అనుమతులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.