Krishna Tribunal | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యున్లకు అధికారాలు కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు జారీచేసిన టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను శుక్రవారం రాత్రి గెజిట్లో ప్రచురించారు. గోదావరి జలాల మళ్లింపు ద్వారా కృష్ణాలోకి వచ్చే జలాలపై కూడా విచారణ జరపాలని సూచించింది. మూడేండ్లలో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
గెజిట్లోని ముఖ్యాంశాలు..
ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదించిన ప్రాజెక్టులవారీగా కేటాయించాల్సి ఉన్నది. నీటిలభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టులవారీగా వినియోగించుకోవడానికి ఆపరేషన్ ప్రొటోకాల్ను రూపొందించాల్సి ఉన్నది. ఆ మేరకు విచారణ చేపట్టాలని ఇప్పటికే బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ -2కు కేంద్రం టీవోఆర్ జారీ చేసింది.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద చేపట్టిన విచారణ యథాతథంగా కొనసాగుతుంది. దానితోపాటు ట్రిబ్యునల్-1 ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో, ఇతర కేటాయింపులు ఏమైనా ఉంటే వాటిపై కూడా బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ -2 విచారణ కొనసాగిస్తుంది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మళ్లించడంతో కృష్ణాలో ఏర్పడిన 80 టీఎంసీల మిగులు జలాల్లో ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలను కేటాయించారు. ఆ జలాలను నాగార్జునసాగర్ ఎగువన మాత్రమే వాడుకోవాల్సి ఉన్నది. ఆ 45 టీఎంసీల జలాలపైనా ట్రిబ్యునల్ విచారణ జరిపి ఏపీ, తెలంగాణకు పంచాల్సి ఉన్నది. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 5(1) ప్రకారం ట్రిబ్యునల్-2 విచారణ జరిపి నివేదిక సమర్పించాలి.