హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రం వ్యవహారం. తెలంగాణతోపాటు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి విషయంలో కేంద్రం ప్రకటన నివ్వెరపోయేలా చేసింది. బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సింగరేణికి రూ.1,600 కోట్లకుపైగా కేటాయించినట్టు గొప్పగా చెప్పుకొన్నది. వాస్తవానికి ఇలాంటి కేటాయింపులు ఏమీ లేవు. కానీ సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి ఉండటంతో ప్రతిఏటా మూలధన వ్యయంగా సంస్థ చేసే ఖర్చును తామే ఇచ్చినట్టు ప్రతియేటా బడ్జెట్లో చూపించుకొంటూ ప్రచారం చేసుకొంటున్నది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే పద్దు కింద ఎన్ఎల్సీ, కోల్ ఇండియాతోపాటు సింగరేణికి నిధులు కేటాయించినట్టు చూపెట్టుకున్నారు. ఇలా బడ్జెట్లో సింగరేణికి రూ.1,650 కోట్లు, ఎన్ఎల్సీ (నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్) సంస్థకు 2,880.01 కోట్లు, కోల్ ఇండియాకు రూ.16,500 కోట్లు గ్రాంట్ కింద ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
నిజానికి బడ్జెట్లో గ్రాంట్స్ కింద చూపెట్టడమే కానీ.. కేంద్రం సింగరేణికి ఇప్పటివరకు ఒక్క పైసా విదిల్చింది లేదు. కానీ బడ్జెట్లో మాత్రం కోట్ల రూపాయలను గ్రాంట్ కింద కేటాయిస్తున్నట్టు చూపెడుతున్నది. 2023-24 బడ్జెటే కాదు, అంతకుముందు 2021- 22లో చూపెట్టినట్టు రూ.1,713.70 కోట్లలో.. 2022-23 (రివైజ్డ్)లో చూపెట్టినట్టు రూ.1600 కోట్లలో ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు.
కేంద్రం బడ్జెట్ పద్దుల్లో చెప్పుకునేది ఒకటైతే.. వాస్తవం మరోలా ఉంటున్నది. ప్రతిఏటా సింగరేణి మూలధన వ్యయం కింద కొంత మొత్తాన్ని స్వయంగా ఖర్చు పెట్టుకుంటుంది. ఇలా ప్రతిఏటా సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఈ మూలధన వ్యయం ఉం టుంది. ఇదంతా సింగరేణి తన లాభాల నుంచి మాత్రమే ఖర్చు పెడుతుంది. అయితే ఇలా మూలధన వ్యయంగా సింగరేణి ఖర్చు చేస్తున్న మొత్తాన్ని కేంద్రం బడ్జెట్లో తమ కేటాయింపులుగా చూపిస్తున్నది. అలా కేటాయించిన మొత్తం నుంచి సింగరేణికి ఒక్క పైసా కేటాయించిది లేదు.
ప్రతి ఏటా సింగరేణి మూలధన వ్యయంగా కొంత మొత్తాన్ని నిర్దేశించుకొని ఖర్చు పెడుతూ ఉంటుంది. 2015-16లో రూ. 2390 కోట్లు కేటాయిస్తే..నిజానికి అయిన ఖర్చు రూ.2,820.22 కోట్లు. అలాగే 2016-17లో రూ.2,300 కోట్లు కేటాయించగా..రూ.2,013.55 కోట్లు ఖర్చు పెట్టింది. 2022-23లో 2 వేల కోట్లు మూలధన వ్యయం కేటాయించగా.. 2022 డిసెంబరు నాటికి రూ.909.80 కోట్లు ఖర్చయ్యాయి.
సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్రానికి సంస్థ వివిధ పన్నుల రూపంలో ఏటా కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటివరకు రూ.25,095 కోట్లను వివిధ పన్నులు, సెస్సులు, రాయల్టీ రూపేణా చెల్లించింది.