కడ్తాల్, మే 28: తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు బాగున్నాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంసించారు. శుక్రవారం ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై వివిధ రాష్ర్టాలకు చెందిన 12 మంది సర్పంచ్లతో జూమ్లో సమావేశంలో నిర్వహించారు. ఇందులో రాష్ట్రం నుంచి సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఆ గ్రామంలో చేపట్టిన పనుల గురించి లక్ష్మీనర్సింహారెడ్డిని అడిగి కేంద్రమంత్రి తెలుసుకున్నారు. గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ఆయన వివరించారు. పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్ వినియోగం గురించి వివరించగా.. కేంద్రమంత్రి ఆసక్తిగా విని అభినందించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, సాముహిక మరుగుదొడ్ల నిర్వహణ, చెత్త సేకరణ, మొక్కల పెంపకం తదితర విషయాలపై లక్ష్మీనర్సింహారెడ్డి.. మంత్రికి వివరించారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు పూర్తయయ్యాని, జీపీ నిధులతో నిర్మించిన సాముహిక మరుగుదొడ్లను పంచాయతీ సిబ్బందితో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్తో చెత్తను సేకరించి, డంపింగ్యార్డుకి తరలిస్తున్నామని, హరితహారం కార్యక్రమంలో ఇంటింటికీ ఆరు మొక్కలను అందజేశామని వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకొంటున్నామని, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రామ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కరోనా ఆపత్కాలంలోనూ గ్రామంలో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డిని కేంద్ర మంత్రి అభినందించారు.