హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పల్లె పాటలతో తెలంగాణ భాషకు వన్నెతెచ్చిన కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంక న్న శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నారు. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి 2020-21 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ మరాఠీ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత బాలచంద్ర నెమోడే చేతుల మీదుగా గోరటి వెంకన్న అవార్డు అందుకొన్నారు. మొత్తం 24 భాషల రచయితలు, కవులకు అవార్డులను ప్రదానం చేశారు. కవిత్వం, నవల, కథానిక, నాటకాలు, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, సాహిత్య విమర్శ, పురాణ ఇతిహాసాలు తదితర క్యాటగిరీల్లో అవార్డులు అందించారు. ఈ సందర్భంగా వల్లంకి తాళం కవితా సంపుటిపై సాహిత్య అకాడమీ ప్రశంసలు కురిపించింది. ‘వల్లంకితాళం గేయగాఢతకు నెలవైన కవితల సంపుటి. అందులోని కవితలు మానవునికి తన పరిసరాలతో గల బహుముఖ సంబంధాలను వర్ణిస్తాయి. ప్రకృతి, గిరిజన జీవితం, అడవి వంటి వస్తువులను సంప్రదాయేతరంగా, కొట్టొచ్చినట్టు కనిపించే రూపకాలలో, భావ చిత్రాలతో అభివ్యక్తం చేస్తాయి. ఆ కవితలు మానవ అనుభూతులను వెదజల్లుతూ, అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని ఇముడ్చుకుంటాయి. పాఠకులను వినూత్నమైన, శక్తిమంతమైన ప్రపంచానుభవంలోకి తీసుకుపోతాయి. గేయకవితా శక్తికి ప్రాతినిధ్యం వహిస్తాయి. భారతీయ కవిత్వానికి తెలుగు నుంచి గొప్ప చేర్పుగా వల్లంకితాళం నిలుస్తుంది’ అని కొనియాడింది. అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్, కార్యదర్శి కే శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు మహదేశ్ కౌశిక్ పాల్గొన్నారు.
2020-21 సంవత్సరానికి గోరటి వెంకన్నతోపాటు తెలంగాణకు చెందిన తగుళ్ల గోపాల్కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం, దేవరాజు మహారాజుకు బాలసాహిత్య అవార్డులు దక్కాయి. వీరికి త్వరలోనే అవార్డులు ప్రదానం చేయనున్నారు. సాహిత్య అకాడమీ అవార్డులు మాత్రమే శుక్రవారం అందజేశామని, యువ, బాలసాహిత్య అవార్డులను మరో వేడుకలో ప్రదానం చేస్తామని కేంద్ర సాహిత్య అకాడమీ పేర్కొన్నది.
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలుగు ప్రజలు, తెలంగాణ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి వెళ్లిన వెంకన్న శుక్రవారం సీజేఐని కలిశారు. సీజేఐ అభ్యర్థన మేరకు వల్లంకి తాళం నుంచి ‘అడవితల్లి, శివుడా’ అనే రెండు పద్యాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. ప్రకృతి, మనిషి మధ్య సంబంధాన్ని గోరటి తన రచనలో అందంగా ప్రతిబింబించారని కొనియాడారు. వెంకన్నను సత్కరించారు. ఈ సందర్భంగా వల్లంకి తాళం పుస్తకాన్ని సీజేఐకి వెంకన్న బహూకరించారు.