Medical Colleges | యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఎనిమిది కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య 4090కి చేరింది.
ఈ ఏడాది ప్రభుత్వం ఎనిమిది కాలేజీలకు దరఖాస్తు చేసింది. జూన్లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో, అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ, మిగిలిన నాలుగు కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్యశాఖ మానిటర్ చేసి, యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు స్టాఫ్ను నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్లో మొదట ఆ నాలుగు కాలేజీల్లోని ఖాళీలను భర్తీ చేసి.. మిగతా కాలేజీల్లో స్టాఫ్ను బదిలీ చేశారు.
ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇచ్చారు. కాలేజీ, హాస్పిటల్లో ఉండాల్సిన లాబోరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. సీఎం రేవంత్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, ఇతర అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీచేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది.