రవితోపాటు ఇతర అధికారులు కూడా నిరంతరం ఆర్సీబీతో సంబంధాలు నెరుపుతున్నట్టు వారి కాల్డాటాలో వెల్లడైంది. వీళ్ల మధ్య సంబంధాలు మామూలువి కావని జాతీయ స్థాయి పాత్రికేయులు కూడా చెప్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ ప్రధాన బ్రోకర్ రామచంద్రభారతి మహా మాయగాడని సిట్ దర్యాప్తులో బయటపడుతున్న సంచలనాలు చెప్పకనే చెప్తున్నాయి. ఆయన కాల్డాటాను విశ్లేషిస్తున్నప్పుడు అనేకమంది ముఖ్యుల పేర్లు బయటపడుతున్నాయని సిట్ వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వంలోని అత్యున్నత విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న రవి వశిష్ట్ పేరు కూడా రామచంద్రభారతి అలియాస్ ఆర్సీబీ కాల్డాటాలో బయటపడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రవి వశిష్ట్ ఐఆర్ఎస్ అధికారి అని, భారత ప్రభుత్వంలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్నారని అవి చెప్పాయి. ఈ ఇద్దరి మధ్య చాలా కాలంగా వందలాదిగా టెక్స్ మెసేజీలు, వాయిస్ కాల్స్ నడిచినట్టు అధారాలున్నాయని సిట్ వర్గాలు తెలిపాయి. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సింహయాజితో ‘మిమ్మల్ని ఎలా నమ్మేది? బీజేపీలో మీకున్న సంబంధాలేమిటి?’ అని ఆరా తీసినప్పుడు.. ఇదే విషయాన్ని రామచంద్రభారతికి సింహయాజి చేరవేశారు. సెప్టెంబర్ 22న సింహయాజికి రామచంద్రభారతి ఇలా మెసేజ్ పంపారు.
‘పీఎం ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్.’ దీనర్థం.. దీనిలో ప్రధానమంత్రి స్వయంగా పాలుపంచుకుంటున్నారని! కాల్డాటాలో ఇదంతా బయటపడినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. వ్యవహారాన్ని సాఫీగా సాగించడానికి ప్రధానితో, కేంద్ర హోం మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఇద్దరు ముగ్గురు అధికారులను కూడా వాడుకొన్నట్టు తెలుస్తున్నది. ఇందులో రవి వశిష్ట్ కూడా ఒకరని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. రవితోపాటు ఇతర అధికారులు కూడా నిరంతరం ఆర్సీబీతో సంబంధాలు నెరుపుతున్నట్టు వారి కాల్డాటాలో వెల్లడైంది. వీళ్ల మధ్య సంబంధాలు మామూలువి కావని జాతీయ స్థాయి పాత్రికేయులు కూడా చెప్తున్నారు.