హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టింది. ఆ హామీలను నెరవేర్చేందుకు 2023-24 బడ్జెట్లో నయాపైసా విదల్చలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులేమీ కేటాయించలేదు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు అనేక విద్య, వైద్య విద్యాసంస్థలను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వాటి విషయంలోనూ తెలంగాణకు మొండిచెయ్యి చూపింది.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు పెద్దపీట వేసి, తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేసింది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, మెడికల్ కాలేజీ, ఎన్ఐడీ తదితర విద్యాసంస్థలను తెలంగాణకు మంజూరు చేసేందుకు మోదీ సర్కార్కు చేతులు రాలేదు. ఐదేండ్ల క్రితం రాష్ట్రానికి కేటాయించిన ఎయిమ్స్కు అరకొర నిధులిచ్చి చేతులు దులిపేసుకున్నది. దీంతో మరో ఐదేండ్లు గడిచినా ఎయిమ్స్ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.