హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. రాష్ర్టాల అధికారాలను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు మొదటి నుంచీ ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) క్యాడర్ నిబంధనలను రాజ్యాంగ విరుద్ధంగా మార్చేందుకు సిద్ధమైంది. ‘ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (క్యాడర్) రూల్స్-1954’లోని రూల్ నంబర్ 6 ప్రకారం ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర సర్వీసులు లేదా ఇతర సంస్థలకు డిప్యుటేషన్పై పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని ఆసక్తిగా ఉన్న అధికారులను మాత్రమే డిప్యూటేషన్పై పంపిస్తుంటారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా నేరుగా తానే కేంద్ర సర్వీసుల్లోకి తీసుకొనేలా నిబంధనలను మార్చనున్నది. రాష్ర్టాల నుంచి డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి తగినంత మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు రావడం లేదని, దీంతో తమ అవసరాలు తీరడం లేదనే వంకతో ‘రాష్ర్టాల అనుమతితో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేలా’ నిబంధనను మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు కేంద్ర అంతర్గత వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీవోపీటీ) అన్ని రాష్ర్టాల అభిప్రాయాలు కోరుతూ ఈ నెల 12న లేఖలు రాసింది. ఈ నెల 25లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. ఆ లోగా రాష్ర్టాల నుంచి సమాధానం రాకపోతే కేంద్రం నేరుగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఈ నిర్ణయాన్ని అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం తీరుపై ప్రస్తుత, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దుమ్మెత్తిపోస్తున్నారు.
కేంద్రం ప్రతిపాదనను అనేక రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాష్ర్టాల అధికారాలను గుంజుకోవడమేనని స్పష్టంచేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమేనని మండిపడుతున్నాయి. ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆరు రాష్ర్టాల ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశాయి. కేంద్రం ప్రతిపాదన సమాఖ్య విధానం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, దానిని తాము వ్యతిరేకిస్తామని కేరళ న్యాయశాఖ మంత్రి పీ రాజీవ్ పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర సైతం కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదన సహకార సమాఖ్యకు విరుద్ధమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది రాష్ర్టాల పాలనపై ప్రభావం చూపుతుందని, రాష్ర్టాల మధ్య అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం ఓవైపు అనేక జాయింట్ సెక్రటరీ పోస్టులను ఐఏఎస్లతో కాకుండా ఇతర సర్వీసుల అధికారులతో నింపుతున్నది. తద్వారా ఐఏఎస్ల ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నది. మరోవైపు రాష్ర్టాలు తగినంత మంది ఐఏఎస్లను రిలీవ్ చేయడం లేదంటూ నిందలు వేస్తున్నది. కేంద్ర సర్వీసుల్లో విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. అనుక్షణం నిఘా నీడన ఉంటాము. దీంతో ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది. అక్కడ పైనవాళ్లు చెప్పినదానికి తలూపడం తప్ప స్వేచ్ఛగా పనిచేసే అవకాశమే లేదు. అందుకే చాలా మంది కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి సుముఖంగా ఉండరు. ఇప్పుడు కేంద్రం రూల్-6ను మార్చడానికి ప్రయత్నించడం అంటే.. రాష్ర్టాలకు ఉన్న అధికారాన్ని హరించడమే.
–పేరు రాయడానికి ఇష్టపడని ఓ మాజీ ఐఏఎస్ అధికారి
కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలు కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. మాకు కావాల్సిన వారిని నేరుగా తీసుకుంటామని కేంద్రం చెప్పినట్టే.. భవిష్యత్తులో కేంద్రం కేటాయించే అధికారులు మాకు వద్దు అని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి? ఐఏఎస్లను కేంద్రం నియమిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే పనిచేస్తుంటాము. దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండి మేము ఈ ఉద్యోగాల్లో చేరుతాం. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాల అనుమతితోనే డిప్యూటేషన్ ప్రక్రియ నడుస్తుంది. దానిని ధిక్కరిస్తూ కేంద్రం చేస్తున్న ప్రతిపాదన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. న్యాయ పరీక్షకు కూడా నిలబడకపోవచ్చు.
–పేరు రాయడానికి ఇష్టపడని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి