NREGA | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీపై మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నట్టు తెలుస్తున్నది. గత ఐదేండ్లలో తెలంగాణకు పనిదినాలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన కేంద్రం, ఈ ఏడాది మరింత కోత విధించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి కేవలం ఎనిమిది కోట్ల పనిదినాలను మాత్రమే మంజూరు చేసినట్టు అధికారికంగా సమాచారం అందించింది. రాష్ట్రంలో 53.04 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా.. వీటిలో 1.11 కోట్ల మంది సభ్యులు ఉన్నారు.
కూలీలు పనికోసం వలసలు పోకుండా, వ్యవసాయ పనులు లేని సమయాల్లో అదే గ్రామంలో పనికల్పించడానికి ఉపాధి హామి పథకాన్ని తీసుకొచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ పథకానికి క్రమంగా గండికొడుతున్నది. పథకంలో తీసుకొచ్చిన మార్పులు, తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం, కూలి మొత్తాన్ని సకాలంలో ఇవ్వకపోవటం వంటి చర్యలతో కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. పనిచేసినా పైసలు వస్తాయో రావోనని అనుమానాలు కూలీలను వెంటాడుతున్నాయి. గత సంవత్సరం 10.50 కోట్ల పనిదినాలను ఇవ్వగా వాటి కంటే అధికంగా 12.08 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. 2024-25లో ఇచ్చిన 8 కోట్ల పనిదినాలు ఆగస్టు నాటికే పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఉపాధి కూలీల్లో అభద్రతను కల్పించడం, పనికి రాకుండా నిరుత్సాహపరిచే కుట్ర కనిపిస్తున్నదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.