CMR | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బియ్యం (సీఎమ్మార్) సేకరణ విషయంలో కేంద్రం గతంలో మాదిరిగానే కొర్రీలు పెడుతున్నది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ గడువు పొడిగించేందుకు ససేమిరా అంటున్నది. 2021-22 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ గడువును పొడిగించాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖను కోరింది. ఈ నెలాఖరు వరకు యాసంగి సీజన్ గడువును పొడిగించిన కేంద్రం.. వానకాలం సీఎమ్మార్ గడువును పొడిగించేందుకు నిరాకరించింది. నిరుడు యాసంగిలో రైతుల నుంచి 50.67 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎఫ్సీఐకి 25 లక్షల టన్నుల బియ్యం అప్పగించింది. ఇంకా 9 లక్షల టన్నులు ఇవ్వాల్సి ఉన్నది. వానకాలం సీజన్కు సంబంధించి మరో 2 లక్షల టన్నులు మాత్రమే ఇవ్వాల్సి ఉన్నది. నిరుడు వర్షాలు, కేంద్ర కొర్రీలు వంటి ఘటనలతో మిల్లింగ్లో కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ గడువు పొడిగించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
బియ్యం సేకరణ విషయంలో అటు కేంద్రం, ఇటు ఎఫ్సీఐ డబుల్గేమ్ అడుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, జాప్యం చేస్తూ.. మరోవైపు రాష్ట్రమే బియ్యం ఇవ్వడం లేదంటూ బద్నాం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరి కాకుండా ఎఫ్సీఐ కేవలం రైల్వే పాయింట్లకు సమీపంలోని గోదాముల్లో మాత్రమే బియ్యం నిల్వ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నది. మిగిలిన గోదాముల వద్ద పడిగాపులు కాసినా పట్టించుకోవడం లేదని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కేంద్రం బియ్యం తీసుకోకపోతే రాష్ట్రంపై ఆర్థిక భారం పడనున్నది.