పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలి. ఇటీవల కేంద్రం పెంచిన జీఎస్టీతో సామాన్య ప్రజలతో పాటు, రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో చేనేత కార్మికులు నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.
కేంద్ర వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..
తెలంగాణను చూసి కేంద్రం తెలివి తెచ్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా చేనేత కార్మికులను అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు. బీమా చేశారు. రైతు బీమా లాగానే, చేనేత కార్మికులు ఏ కారణం చేత మరణించినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు వారికి అందే విధంగా ఏర్పాటు చేశారు.
చేనేతల ఆదుకోవడానికి రాష్ట్రం తరహా సమగ్ర అభివృద్ధి పథకాలను అమలు చేయాలన్నారు. మానవాళికి సంస్కృతిని నేర్పిన చేనేతలను విస్మరిస్తే చరిత్ర క్షమించదని మంత్రి తెలిపారు. జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో చేనేత కార్మికుల పాత్ర ఎంతో ఉంది. దేశ ప్రజలను ఐక్యం చేసిన అంశాల్లో చేనేతలే కీలకం అన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ కు పిలుపునిచ్చిన గాంధీజీ, స్వదేశీ వస్త్రాలను మాత్రమే వాడాలని చెప్పారు.
స్వయంగా గాంధీజీ నూలు వడికి, చేనేతలకు చేయూత గా నిలిచారని గుర్తు చేశారు.
ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించి, ఆయనే స్వయంగా ఆచరిస్తున్నారు.
ఈ ఏడాది బడ్జెట్ లో చేనేత రంగానికి 1200 కోట్లు కేటాయించామని మంత్రి వివరించారు. పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో మినీ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.