హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీజలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు ఒత్తిడికి కేంద్రం స్పందించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా ? వద్దా ? అంటూ సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఆయన సిఫార్సు మేరకు కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టం-1956 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని మొదటి నుంచి తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీకి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
2020 అక్టోబర్లో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంపై సీఎం కేసీఆర్ గట్టిగా పట్టుబట్టడంతో ఎట్టకేలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకోవాలని షరతు విధించారు. కేంద్రం హామీతో తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకొన్నది. ఇది జరిగి ఏడాది గడిచినా కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో పలుమార్లు సీఎం కేసీఆర్ బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. రాష్ట్ర సర్కారు ఒత్తిడితో కేంద్రం దిగొచ్చి ట్రిబ్యునల్ ఏర్పాటు అంశంపై అభిప్రాయం తెలుపాలంటూ సాలిసిటర్ జనరల్ను కోరింది.