హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. కేంద్రం విధించిన అడ్డగోలు నిబంధనలతో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకే జంకుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో గత రెండేండ్లలో మూడు లక్షలకు పైగా కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేయగా.. శుక్రవారంతో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేవలం 31,241 కుటుంబాలు మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇందుకు కేంద్రం విధించిన నిబంధనలు, షరతులు, తనిఖీలతో కూలీలు భయభ్రాంతులకు గురైనట్టు తెలుస్తున్నది. తొలుత ఆధార్ కార్డును జాబ్ కార్డుకు లింక్ చేయాలని, అప్పుడే పని వివరాలు నమోదవుతాయని చెప్పారు. దీంతో వేల కుటుంబాలు కొన్ని రోజులపాటు పనులకు దూరమయ్యాయి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలు కొత్త బ్యాంకు ఖాతాను తెరవాలని చెప్పడంతో దీని కోసం మరికొన్ని రోజులు బంద్ చేయాల్సి వచ్చింది. మరో వైపు తనిఖీల పేరుతో చేసిన హంగామాతో చేసిన పనులకు కూలీ డబ్బులు వస్తాయో రావోనని ఆందోళన చెందిన కూలీలు మళ్లీ పనులకు రావడానికి ఆసక్తి చూపలేదు. గతంలో ఎప్పుడో చేసిన పనులను ఇప్పుడు చూపెట్టండని అడిగారు. దీనికి కిందిస్థాయి ఉద్యోగులు సర్దిచెప్పినా కూలీల్లో నమ్మకం రాలేదు.
పనికి వచ్చినవారు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పనిలో ఉన్నట్టు ఫొటోలను అప్లోడ్ చేస్తేనే కూలి చెల్లిస్తామనే నిబంధన విధించారు. ఇక కూలి డబ్బులను గతంలో కంటే ఆలస్యంగా చెల్లించడం కూలీలను మరింత నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్వేర్ ఉన్న సమయంలో వేసవి కాలంలో అదనపు కూలీని చెల్లించే వారు. కానీ దానినీ ఎత్తివేశారు. ఒక వైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, భూమి గట్టిగా ఉండటం, లక్ష్యం చేరుకోలేకపోవటంతో కూలి తక్కువగా వస్తున్నది. ఈ మాత్రం కూలికి ఇతర పనులకు పోవడం ఉత్తమం అనికొని పనులకు రావడానికి జంకుతున్నారు. ఇలా అనేక కారణాల వల్ల కూలీలు ఉపాధి హామీ పనులకు దూరమవుతున్నారు. తాము విధించిన నిబంధనలు కూలీలను నిరుత్సాహానికి గురిచేస్తాయన్న ముందస్తు అంచనాతోనే కేంద్రం.. బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. రాష్ట్రంలో మొత్తం 52.76లక్షల జాబ్ కార్డులను జారీ చేశారు. వీటిలో 1.11 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. 61.42 శాతం మంది మహిళలు ఉపాధి హామీలో పనిచేసినట్టుగా అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మగవారు వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లినా వారి ఇంట్లో ఆడవారు మాత్రం ఉపాధి హామీ పనులకు హాజరవుతూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.