హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర హోంశాఖ ఊరట కల్పించింది. విదేశీ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా, నగదును బ్యాంక్లో డిపాజిట్ చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చింది. వాటిని శ్రీవారి కానుకలుగా పేర్కొనాలని కోరింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్ సమాచారమిచ్చారు.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోని కారణంగా టీటీడీకి కేంద్ర హోంశాఖ రూ.3 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించిన రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాలేదు. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో మారకానికి భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించలేదు.