వరంగల్, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా దేశంలో అసమానతలను పెంచుతున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకొని దేశంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల పరంగా అసమానతలను పెం చిందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను తొలగించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని విమర్శించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీ యం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు, హ త్యలు, అత్యాచారాలు బాగా పెరిగాయని అన్నారు. బుధవారం ఆయన ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్తో కలిసి హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని అన్నారు. రాజ్యాంగంలోని 14, 15, 16వ అధికరణల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 1961లో రిజర్వేషన్లు మొదలయ్యాయని, అప్పుడు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అరవై ఏండ్లుగా ఈ వర్గాల జనాభా ఎంతో పెరిగిందని, 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో ఎస్సీలు 16.6 శాతం, ఎస్టీలు 8.6 శాతం ఉన్నారని తెలిపారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారమైతే ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని, ఈ వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆరోపించారు.
ఆర్టికల్ 16కు సవరణ చేపట్టని కేంద్రం
రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అనే పదం లేదని, 16వ ఆర్టికల్కు సవరణ చేసి ఈ పదాలను కలుపాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కడియం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాలపై కక్షగట్టి ఇబ్బందులు కలిగిస్తున్నదని పేర్కొన్నారు.. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఏ వర్గానికైనా రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, అర్హులైన వారికి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల ఎజెండాలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ చెప్పిందని, ఆ లెక్కన ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా, ఒక్క శాతం కూడా భర్తీ చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలను కల్పించకపోగా, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ఉద్యోగులను రోడ్డు మీదకు తెస్తున్నదని మండిపడ్డారు. ఈ సంస్థల్లో కొత్త వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నదని, ఈ చర్యలతో చెప్పకుండానే రిజర్వేషన్లను తీసివేస్తున్నదని ఆయ న పేర్కొన్నారు. పేదల సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్గా కొనసాగుతున్నదని కడియం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ దేశంలోనే ముందున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు 302 గురుకులాలు మాత్రమే ఉండేవని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కొత్తగా 744 గురుకులాలను ప్రారంభించినట్టు చెప్పారు. రాష్ట్రంలో అన్ని కలిపి ఇప్పుడు 1,716 గురుకులాలు ఉన్నాయని తెలిపారు.