జగిత్యాల : తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఆరోపించారు. పట్టణంలోని చింతకుంట చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద వంద శాతం రాయితీతో ఉచిత చేప పిల్లలను నీటిలో వదిలారు. పెద్ద చెరువు, లింగం చెరువులో విడుదలకు చేప పిల్లలను గంగపుత్రులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయను విజయవంతంగా అమలు చేయగా దానినే కేంద్రం అమృత్ సరోవర్, మిషన్ భగీరథ పథకాన్ని హర్ ఘర్ నల్ ను ప్రారంభించిందని అన్నారు. గత ప్రభుత్వాలు చెరువులను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గంగ పుత్రులకు మోపెడ్, వ్యాన్, జీప్, లైఫ్ జాకెట్, బోట్ లు అందజేశారని పేర్కొన్నారు.
సొసైటీ లో సభ్యులను పెంచే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. అన్ని కుల సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బాలే లత శంకర్, పద్మావతి పవన్, మత్స్య సహకార సంఘ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల అంజయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి దామోదర్ పాల్గొన్నారు.