హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పీహెచ్సీలలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను హైదరాబాద్లోని కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు. వీటి ద్వారా డాక్టర్లు, సిబ్బంది పనితీరు, దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని వైద్యవర్గాలు చెప్తున్నాయి. అవసరమైతే నేరుగా ఈ కెమెరాల ద్వారా వైద్యసిబ్బందితో సంభాషించేలా కసరత్తు చేస్తున్నారు.
ఏరియా హాస్పిటళ్లు, సీహెచ్సీలు, జిల్లా దవాఖానలు, సూపర్ స్పెషాల్టీ దవాఖానల్లో వైద్యులు సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని చోట్ల బయోమెట్రిక్ను అమలు చేస్తున్నారు. ఫలితాలను పరిశీలించిన అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న దవాఖానల్లో ఓపీ సమయాన్ని పొడిగించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల సూచించారు. ఓపీలో జూనియర్ డాక్టర్లే ఉంటున్నారన్న ఫిర్యాదులపైనా ఆయన దృష్టిపెట్టారు. హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆఫీసుకే పరిమితం కావొద్దని, కచ్చితంగా ఓపీలో కూర్చోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పూర్తిగా రద్దు చేసే మార్గాలపై వైద్యారోగ్య శాఖ దృష్టిపెట్టినట్టు సమాచారం. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొద్దనే నిబంధన ఇప్పటికే నిమ్స్లో కఠినంగా అమలవుతున్నది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు.