కేంద్రమంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. యువతకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం.
– మంత్రి కేటీఆర్
ఆదిలాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్న మొన్నటి వార్త.. ప్రధాని మోదీ దోస్తు అదానీ సిమెంట్ రంగంలో దేశంలోనే రెండోస్థానానికి చేరుకొన్నాడు. ఈ వార్త రావడానికి సరిగ్గా పదిరోజుల ముందు మోదీ సర్కారు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమ్మకానికి తొలి అడుగు వేసింది. అదానీ ఏ రంగంలో అడుగుపెడితే.. ఆ రంగానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం కావాల్సిందే. విద్యుత్తులో కాలుపెడితే.. కేంద్రం సంస్కరణలను పట్టుకొస్తుంది. విమానాలు, హెలికాప్టర్లు, రేవులు.. ఒకటేమిటి.. దోస్తు కోరడమే తరువాయి ఇచ్చేయడమే.. ఇప్పుడు సీసీఐ వంతు వచ్చింది. ఈ పరిశ్రమకు సంబంధించి పనిచేయని యూనిట్లలో యంత్ర సామగ్రిని తుక్కు కింద అమ్మడానికి ఈ నెల 5న టెండర్లు కూడా పిలిచేసింది.
23తో ఆ గడువు కూడా ముగుస్తున్నది. సీసీఐ యూనిట్ కూడా ఇందుకు బలవుతున్నది. సీసీఐని తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా పోరాడుతూనే ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న, మాజీ ఎంపీ నగేశ్.. అప్పటి కేంద్ర మంత్రులను కలిసి పదే పదే విజ్ఞప్తులు చేశారు. ఆదిలాబాద్ యూనిట్ను ప్రారంభించడానికి సహకరిస్తే అవసరమైన రాయితీలన్నీ కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు.. చాలాసార్లు కేంద ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండేను కలిసి వినతిపత్రాలు అందించారు. మౌఖికంగా అభ్యర్థించారు. మోదీ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వినతులను స్క్రాప్ మాదిరిగానే చెత్తబుట్టలో పడేసింది.
తెరవడానికి అవకాశాలున్నా..
ఆదిలాబాద్లో సీసీఐని ప్రారంభించడానికి అవకాశాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. సీసీఐని తెరిస్తే.. 2,500 మందికి ప్రత్యక్షంగా, 2,500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే సిమెంట్కు రాష్ట్రంలోనే భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హౌసింగ్, ఇన్ఫ్రా రంగాలకు సిమెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. జాతీయ రహదారి 44 పై సీసీఐ ఉన్నది. సిమెంటును తరలించడానికి ఆదిలాబాద్ నుంచి రైలు, మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ర్టాలకు రోడ్డు మార్గం ఉన్నది. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తుతోపాటు నీటి వనరులుకూడా ఉన్నాయి. సిమెంటు తయారీకి అపారమైన వనరులున్నా కేంద్రం విక్రయానికి పెట్టడం పట్ల కార్మిక సంఘాల నాయకుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని కేంద్రం
ఈ నేపథ్యంలోనే సీసీఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేసింది. ఈ విజ్ఞప్తులేవీ మోదీ సర్కారు పట్టించుకోకుండానే ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను అమ్మడానికి చర్యలు చేపట్టింది. పరిశ్రమ స్క్రాప్ ఈ వేలంలో భాగంగా ఈ నెల 5 నుంచి ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టం ద్వారా బిడ్లను ఆహ్వానించింది. ఈ నెల 23 వరకు టెండర్లను స్వీకరించనున్నారు. 120 రోజుల్లో టెండర్లను తెరిచి స్క్రాప్ అమ్మకం ప్రక్రియను ప్రారంభిస్తారు. యంత్ర సామగ్రి వేలం తర్వాత సిమెంటు పరిశ్రమకు సంబంధించిన విలువైన భూములు, భవనాల అమ్మకాన్ని సైతం చేపడతారని కార్మికసంఘాల నేతలు చెప్తున్నారు. సీసీఐని తెరిపించడానికి బీజేపీ మినహా అఖిలపక్ష నాయకులు సీసీఐ సాధన కమిటీని ఏర్పాటుచేసి ఆరు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసి విజ్ఞప్తిచేశారు. ప్రజాందోళనలు కూడా మోదీ ప్రభుత్వానికి పట్టడంలేదు.
సామగ్రి వేలాన్ని అడ్డుకుంటాం
సీసీఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా ప్రయత్నిస్తున్నది. పునరుద్ధరణకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మోదీ సర్కారు వ్యవహరిస్తున్నది. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసినా ఫలితంలేదు. సీసీఐ యంత్రాలను తుక్కు కింద వేలం వేయాడాన్ని అడ్డుకుంటాం.
– విజ్జగిరి నారాయణ, సీసీఐ సాధన కమిటీ కో-కన్వీనర్, ఆదిలాబాద్
5 వేలమంది ఉపాధికి నష్టం
ఆదిలాబాద్ సీసీఐ ప్రారంభం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. హైదరాబాద్కు కేంద్ర హోం మంత్రి అమిత్షా సీసీఐ పునఃప్రారంభంపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సీసీఐ పై హైకోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో ఈ టెండర్లు ఎలా పిలుస్తారు? ఈ విషయంపై నాన్ ఆపరేటివ్ యూనిట్ జనరల్ మేనేజర్తో మాట్లాడాం. బీజేపీ ప్రభుత్వం సీసీఐని పునరుద్ధరించాల్సిందే. ప్రత్యేక్ష, పరోక్షంగా 5వేల మంది ఉపాధిని కాలరాస్తే చూస్తూ ఊరుకోం.
– ఎస్ విలాస్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, ఆదిలాబాద్ జిల్లా
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే.. మరోవైపు పరిశ్రమలోని యంత్రాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘కేంద్ర మంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. యువతకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
సీసీఐ మా హక్కు
నెటిజన్లు మంత్రి కేటీఆర్కు మద్దతుగా ‘సీసీఐ మా హక్కు.. దాని అవసరం ఆదిలాబాద్ జిల్లాకు ఎంతగానో ఉందం’టూ ట్వీట్లు చేశారు. ‘వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ను శాశ్వతంగా వెనక్కి నెట్టేస్తారా? అమిత్షా తెలంగాణకు ఎందుకు వచ్చారు.. సీసీఐని తెరవడం చేతకాకపోతే మా రాష్ట్రానికి ఇచ్చేయండి.. లేదా గద్దె దిగిపోండి’ అని మల్లికార్జున్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ముందుకు రాకున్నా.. ఆస్తులను అమ్మేందుకు ముందుంటుంది. చేసిన అప్పుల కోసం కంటికి కనిపించిన పరిశ్రమలను కంటతడి పెట్టిస్తుంది. ప్రజల ముందు మాయ మాటలు చెబుతూ, వెనుక పరిశ్రమలను వేలానికి వేస్తుంది. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ, సీసీఐ మా హక్కు.. దాన్ని పునఃప్రారంభించండి.. ఆదిలాబాద్కు సీసీఐ అవసరం’.. అంటూ ట్వీట్లు చేశారు. మొన్న తెలంగాణకు వచ్చి గప్పాలు కొట్టిన అమిత్షా సీసీఐ పరిశ్రమను పునరుద్ధరిస్తామని ఎందుకు చెప్పలేదు.. మీ బడా జూటా పార్టీకి తెలంగాణ ఓట్లు తప్ప.. మా పాట్లు పట్టవా.. బీజేపీ రాష్ట్ర నాయకులు దీనికి ఏమని సమాధానం చెబుతారు.. అని నెటిజనులు నిలదీశారు.
ఆదిలాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి చెందిన యంత్రసామగ్రిని కేంద్ర ప్రభుత్వం వేలం వేయడంపై ఆదిలాబాద్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీ ప్లెక్సీని దహనం చేశారు. సీసీఐని ప్రారంభించడానికి అవకాశాలున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తున్నదని సాధన కమిటీ సభ్యులు ఆరోపించారు. పరిశ్రమను ప్రారంభించాలని నాలుగు నెలలుగా తాము ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. పరిశ్రమను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలో భూములు కోల్పోయిన వారు, ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పరిశ్రమ పునఃప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తున్నా కేంద్రం కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. స్క్రాప్ వేలాన్ని అడ్డుకొంటామని సాధన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
కేంద్రానిది నమ్మక ద్రోహం: ఎమ్మెల్యే జోగు రామన్న
సీసీఐ పరిశ్రమలోని యంత్రసామగ్రిని వేలానికి పెట్టడం కేంద్రం చేసిన నమ్మక ద్రోహ చర్య అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. బేల మండల కేంద్రంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర మంత్రుల బృందం, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంత్గితేను కలిసినప్పుడు పరిశ్రమ ప్రారంభానికి సానూకూలంగా ఉన్నారని గుర్తుచేశారు. సీసీఐని సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ పరిశ్రమను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు సామగ్రిని వేలం వేస్తూ కేంద్రం నమ్మకద్రోహానికి పాల్పడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సీసీఐని అప్పగిస్తే తాము పునఃప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ధ్వజమెత్తారు. సీసీఐ ఆస్తుల అమ్మకం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.