ఖమ్మం, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సాగుకు నీళ్లిస్తామంటే మేం రక్తతర్పణానికి సిద్ధంగా ఉన్నాం’అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్పష్టంచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధించడానికి రక్తం చిందించింది బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణవాదులుగా తమకు త్యాగాలు కొత్తకాదని అన్నారు. రైతులకు సాగునీరు ఇస్తామంటే మరోసారి రక్తం ఇవ్వడానికి వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ‘అయ్యా రేవంత్రెడ్డి గారూ.. మా రక్తం ఎంతకావాలన్నా తీసుకో.. రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వు’ అంటూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా శాఖ రూపొందించిన పోస్టర్లను ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి వద్దిరాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కష్టాలను చూసి ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన రేవంత్రెడ్డి.. అవగాహనా రాహిత్యంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. సింగరేణి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఒక డ్రామా మాత్రమేనని పేర్కొన్నారు. ఏపీలో ఎన్నో ఏండ్లుగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినా అక్కడి నేతలు తమ ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడలేదని గుర్తుచేశారు. ఎమ్మె ల్సీ తాతా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పేరు చెప్తేనే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐ ఎం పార్టీలకు వెన్నులో వణుకు పుడుతున్నదని అన్నారు. సింగరేణి అక్రమాలపై హరీశ్రావు గళం విప్పిన తర్వాతే కిషన్రెడ్డికి భరోసా యాత్ర గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.