హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై గతం లో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖ లు చేసింది. సుమారు 80 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు చెప్పారు. అయితే, ఈ అంశంపై 7న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ టీ వినోద్కుమార్ ధర్మాసనం ప్రకటించింది.
అప్పటివరకు స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల బదిలీల నిమిత్తం జారీ చేసిన జీవో 9 చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం థోల్కట్టకు చెందిన సకుబాయి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. పాఠశాల విద్యాశాఖ జారీచేసిన జీవోను రద్దు చేయని పక్షంలో టీచర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు, జీవిత భాగస్వామి క్యాటగిరీ కింద కొందరికి ఎలాంటి అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ వాదన.