కామారెడ్డి : క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మాతా-శిశు దవాఖానలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒకరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్ వారు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయంమన్నారు. గతంలో క్యాన్సర్ వ్యాధి సోకితే నయం చేయడం కష్టంగా ఉండేదన్నారు. మారిన ఆధునిక పరిస్థితులలో నేడు చాలా మందికి క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు.
క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తించినట్లయితే నివారణ సాధ్యమేనని ఆయన తెలిపారు. రసాయన ఎరువులతో పండించిన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ పెరుగుతుంది. సహజమైన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, బాన్సువాడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.