హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖ పటిష్టంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను తిరిగి వెనక్కి రావాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే అన్ని శా ఖలు, విభాగాల్లో డిప్యూటేషన్లు, ఓడీలపై పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించింది. రెవెన్యూ ఉద్యోగులు పలు శాఖల్లో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. మరోవైపు రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత ఉన్నది.
మరోవైపు ధరణి పోర్టల్, భూ సమస్యలు, ధరణి కమిటీకి అనుబంధంగా ప్రత్యేకంగా అధికారులను నియమించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో డిప్యూటేషన్లను రద్దు చేసి, వారికి రెవెన్యూ శాఖలోనే ఖాళీల్లో పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే పలువురు అధికారులను వెనక్కి పిలిపించినట్టు సమాచారం. కొందరిని సొంత పోస్టులో చేరాలని ఆదేశించగా, మరికొందరిని సీసీఎల్ఏకు అటాచ్ చేసినట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మూడేండ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.