మల్దకల్, ఫిబ్రవరి 18 : చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చిన్నతండాలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దెలబండకు చెందిన రైతు బోయగంతుల నర్సింహులు భూమి చిన్నతండా సమీపంలో ఉన్నది. మంగళవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకున్న రైతు పశువులను గుడిసెల్లో కట్టేసి ఇంటికి వచ్చాడు.
బుధవారం తెల్లవారు జామున పొలానికి వెళ్లిన ఆయనకు ఒక లేగదూడ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. దగ్గరలోని గుండ్రాలగుట్ట వద్ద లేగదూడ అవశేషాలు కనిపించడంతో పారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్టు అధికారులు వచ్చి పరిశీలించి చిరుత దాడేనని గుర్తించారు. అనంతరం వారు చుట్టుపక్కల ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నదని రైతులు జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.