హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథాన పరుగులు తీస్తున్నదని, ‘తెలంగాణ రైజింగ్’ అని ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి సర్కార్.. క్షేత్రస్థాయిలో మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో అప్పులు చేయడంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు జోరుగా రుణాలు సమీకరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై వడ్డీల భారం పెరిగి సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన తాజా నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ నివేదికలో పేర్కొన్న గత 12 ఏండ్ల నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణాల సమీకరణ మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నట్టు స్పష్టమవుతున్నది. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లోనే బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేయడం ఆర్థిక నిర్వహణపై రేవంత్రెడ్డి సర్కార్కు ఏమాత్రం అజమాయిషీ లేదని తేటతెల్లమవుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న కొవిడ్ సమయంలోనూ తెలంగాణలో రుణ సమీకరణ నియంత్రణలోనే ఉన్నది. నాడు అన్ని వ్యాపార సంస్థలు బంద్ అయినా, రాష్ర్టానికి పెద్దగా ఆదాయం లేకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. 2020 నుంచి 22 వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల్లో కూడా రాష్ట్ర అప్పులు రూ.44 వేల కోట్లకు మించలేదు. కానీ, గత రెండేండ్లుగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల వరకు రుణాలు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవి జనవరి నాటికే బడ్జెట్ అంచనాలను దాటి 128.03 శాతానికి చేరుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.54,009.74 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న రేవంత్రెడ్డి సర్కార్.. జనవరి నాటికే రూ.69,148.28 కోట్ల అప్పులు తీసుకున్నట్టు ‘కాగ్’ నివేదిక వెల్లడించింది. దీనికి అదనంగా ఈ నెల 9న రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి తెచ్చిన రూ.9 వేల కోట్ల రుణాన్ని కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేవంత్రెడ్డి సర్కార్ తెచ్చిన మొత్తం అప్పలు రూ.78,188 కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన వార్షిక రుణ సమీకరణ లక్ష్యం కంటే 44% అధికం.
రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఆశించిన స్థాయిలో పెరుగకపోవడంతో రేవంత్రెడ్డి సర్కార్ అప్పులపైనే అధికంగా ఆధారపడుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,29,720.63 లక్షల కోట్ల సొంత రాబడి వస్తుందని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. జనవరి ఇది నాటికి కేవలం రూ.1,38,371.11 కోట్లకే పరిమితమైంది. బడ్జెట్ అంచనాలో ఇది కేవలం 60.23 శాతమే. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మాత్రం బడ్జెట్ అంచనాలను దాటిపోవడం, ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 10 నెలల్లోనే 128 శాతానికిపైగా చేరడం రేవంత్రెడ్డి సర్కార్కు ఆర్థిక క్రమశిక్షణ లేదని రుజువు చేస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై వడ్డీల భారం పెరిగి, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నది.
