CM KCR | మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉన్నత స్థానంలో ఉండి శ్రీనివాస్రెడ్డి మీకు సేవ చేసే భాగ్యం వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కడుపు, నోరుకట్టుకొని 24 ఏళ్ల కిందట ఉద్యమాన్ని ప్రారంభించి.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఏ గతి అయిన నిజాంసాగర్ను ఎలా చేసుకున్నాం ? సమైక్య పాలకులు నిజాంసాగర్ను సర్వనాశనం చేశారు.
సింగూరును హైదరాబాద్కు ఇచ్చారు. నిజాంసాగర్కు నీళ్లురావాలంటే.. ఇదే పోచారం శ్రీనివాస్రెడ్డి ధర్నాలు చేసిన పరిస్థితి. పంటలను కాపాడుకునేందుకు ఆందోళన చేసిన పరిస్థితి. ఇంతకు ముందు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నట్టే మీరు కాలుమీద కాలేసుకొని కూసుంటే.. నిజాంసాగర్ 365 రోజులు నిండి ఉంటుందని మీకు హామీ ఇస్తున్నా. శ్రీనివాస్రెడ్డి నాయకుడినని అనుకోడు.. స్పీకర్ పదవిలో ఉన్నానని రుబాబ్ చేయడు. మామూలు కార్యకర్త లెక్కనే ఉంటరు. జాకోరా, చందూరు లిఫ్ట్లు, సిద్ధేశ్వరం రిజర్వాయర్లు కట్టిస్తున్నారు. ప్రజల కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
‘తిరిగిన కాలు ఊకోదు.. చేసిన చేయి ఊకోదు’ అన్నట్లుగా పని చేసే అలవాటు కాబట్టి శ్రీనివాస్రెడ్డి తపన పడుతుంటారు. ఒకమాట చెబితే నమ్మలేరు. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని.. ఆయన స్పీకర్. నా నియోజకవర్గంలో కంటే ఎక్కువగా పోచారం బాన్సువాడలో 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. శ్రీనివాస్రెడ్డంటే మంత్రులకు, నాకు గౌరవం ఉంది. ఆయన గౌరవప్రదమైన వ్యక్తి. మా అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. ఆయనకు ఏ లోటు రాకుండా ఉండాలని పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. లక్ష పైచీలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించి పంపించే బాధ్యత మీది. మళ్లీ చాలా పెద్ద, ఉన్నత స్థానంలో ఉండి శ్రీనివాస్రెడ్డి సేవ చేసే భాగ్యం వస్తుంది. మళ్లీ మన గవర్నమెంటే వస్తుంది’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.