KTR | నరాలను పోగులుగా చేసి.. తమ రక్తాన్ని రంగులుగా వేసి.. గుండెలను కండెలుగా మార్చి.. చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. పేగులను వస్త్రాలుగా అందించి.. మనిషికి నాగరికతను అద్దిన.. చేనేత కార్మికులందరికీ.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం..దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగం అని పేర్కొన్నారు.
నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు.. మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు.. వినూత్న పథకాలకు శ్రీకారంచుట్టిన పాలకుడు.. మన కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. సమైక్యరాష్ట్రంలో ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లే.. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి రూ.1200 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం దక్కిందని.. ఎన్నో విప్లవాత్మక పథకాలకు చిరునామా మన తెలంగాణ అని తెలిపారు.
దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో చేనేత మిత్ర తీసుకొచ్చామని.. నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం అని కేటీఆర్ తెలిపారు. నేతన్నకు బీమా పేరుతో 5 లక్షల రూపాయల ధీమా, 36 వేల మంది నేతన్నల కుటుంబాలకు కొండంత అండ అందించామని చెప్పారు. 10,150 మంది చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రూ.29 కోట్ల రుణాల మాఫీ , చేనేత కళాకారులకు ఆసరా పెన్షన్ తో ఆపన్న హస్తం.. ఇలా పద్మశాలీల ఆత్మగౌరవం పెంచే చారిత్రక నిర్ణయాలనేకం ఉన్నాయని తెలిపారు.
సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించిన యజ్ఞం.. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమమని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు.. ఓ సంకల్పమని పేర్కొన్నారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్.. ఓ సంచలనమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులు చిందించాయని.. కానీ.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
NDA హయాంలో.. తొలిసారిగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్ను విధించారని, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేశారని, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు రద్దు చేశారని, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు చేశారని, చేనేత కార్మికుల త్రిప్ట్ పథకం రద్దు చేశారని, హౌస్ కం వర్క్ షెడ్ పథకాల రద్దు చేశారని, మహాత్మాగాంధీ బునకర్ బీమా పథకం రద్దు చేశారని,
యార్న్ పై సబ్సిడీ 40% నుంచి 15 శాతానికి తగ్గించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ పాలనలో.. మళ్లీ చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతినిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతుందని అన్నారు. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు కళ్లు తెరవాలని సూచించారు. సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.