KTR | రైతు భరోసా డబ్బులను ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని అన్నారు. వానాకాలం పంట సీజన్కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని తెలిపారు. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు.
రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. మీ చేతగానితనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదని స్పష్టం చేశారు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు మిమ్మల్ని వదిలిపెట్టరని హెచ్చరించారు.
ఎద్దు ఏడ్చినా ఎవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్కు అన్నదాతల ఉసురు తప్పదని అన్నారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారని విమర్శించారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు.. మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిపాయి ఎక్కడపోయాడని ప్రశ్నించారు.
ఈ ఖరీఫ్కు రైతు భరోసా లేనట్టే
రైతు భరోసా పై సబ్ కమిటీ వేశాం, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తాం – మంత్రి తుమ్మల నాగేశ్వర రావు pic.twitter.com/R2JyOfwzks
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2024
పేదల ఇండ్లను, జీవితాలను పడకొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ.. మీరుచెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7500 ఇచ్చేందుకు పైసలు లేవా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. పచ్చి అబద్దాలు, మోసాలతో రైతులను దగా చేశారని మండిపడ్డారు. నీ దగాకోరు మాటలు నమ్మి గెలిపించిన రైతులను అరిగోస పెడుతున్నారని వాపోయారు.
రుణమాఫీ మోసం చాలదన్నట్లు …ఇప్పుడు రైతు భరోసాలోనూ దగా చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ప్రజలే నిలదీస్తారని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని.. రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదని స్పష్టం చేశారు.