KTR | పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ స్కాంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేక మంది హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ మొత్తం స్కాంలో బీజేపీ పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు. బీజేపీ పార్టీ శాసనసభా పక్ష నేతనే స్వయంగా అవినీతి జరిగిందని చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై కూడా తమకు అనుమానం వస్తుందని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరఫున పలు డిమాండ్లు చేశారు.
ఇవే ఆ డిమాండ్లు..
☞ 90 రోజుల టెండర్ గడువు ముగిసినా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి.
☞ రైస్ మిల్లర్లు కొంటామని సుముఖత వ్యక్తం చేసినా అసలు టెండర్లు ఎందుకు పిలిచారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
☞ మా ప్రభుత్వంలో టెండర్లు పిలిచినా.. తక్కువ ధర వస్తే రద్దు చేశాం.. క్వింటాలుకు రూ.2100కి కొనేందుకు రైస్ మిల్లర్లే సిద్ధంగా ఉన్నప్పుడు అంత కంటే తక్కువ వస్తే ఏం లాభమని ఆ టెండర్లను రద్దు చేశాం.. కానీ రూ.2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించారు. బ్లాక్ లిస్ట్లో పెట్టిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చారో చెప్పాలి.
☞ నిబంధనల ప్రకారం 90 రోజుల్లో లిఫ్టింగ్ జరగాలి. 20 శాతమే లిఫ్టింగ్ జరిగింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని చూస్తున్నారు. దానిపై ఎక్సటెన్షన్ ఇవ్వకుండా.. టెండర్ను రద్దు చేయాలి.
☞ ఇప్పటివరకు ఏజెన్సీల బాధ్యత ధాన్యం సేకరణ మాత్రమే.. కానీ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు డబ్బుల వసూలులో ఉన్నారు. దీనికి ఎలా అనుమతి ఇచ్చారో సమాధానమివ్వాలి. అవసరమైతే ఎఫ్సీఐ కూడా దీనిపై ఈడీకి ఫిర్యాదు చేయాలి. మనీలాండరింగ్ జరిగింది కాబట్టి దీనిపై ఈడీ విచారణ జరపాలి.
☞ ధాన్యం లిఫ్ట్ చేయకుండా రూ.2236 చొప్పున చెల్లించాలని రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం మనీలాండరింగ్ కిందకు వస్తుంది. ఇది పెద్ద కుంభకోణం. ఎఫ్సీఐ దీనిపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ స్పందించాలి. లేకపోతే బీజేపీపై కూడా అనుమానాలు తలెత్తుతాయి.
మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ మంత్రి కడిగిన ముత్యమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం, భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ల మాదిరిగా.. పౌరసరఫరాల శాఖలోని రెండు టెండర్లపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా.. ఈవ్యవహారాన్ని వదిలిపెట్టమని తెలిపారు. ఆధారాలతో సహా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఏజెన్సీల ముందు పెడతామని తెలిపారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్లను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.