హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో జరుగుతున్న బీఆర్ఎస్ కదన భేరి సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు మరోసారి జంగ్సైరన్ మోగించనున్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో దాదాపు లక్ష మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో తమకు కలిసొచ్చిన గడ్డ నుంచే మొదటి సభను నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.
పార్లమెంట్ ఎన్నికల ముగింట్లో నిర్వహిస్తున్న కదనభేరిని బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైనదిగా భావిస్తున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే జనాకర్షక నాయకులు లేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తున్న నేపథ్యంలో ఈ సభ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది. కరీంనగర్ గడ్డ మరోసారి తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని గులాబీ శ్రేణులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నాయి. ఈ సభ వేయబోయే ముద్రను గులాబీ పార్టీ శ్రేణులతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.